
2025 సంవత్సరం కేవలం క్యాలెండర్ ఇయర్గా మాత్రమే కాకుండా, సోషల్ మీడియా చరిత్రలో అనేక ఆసక్తికరమైన విషయాలకు గ్రౌండ్ గా నిలిచింది. ఈ ఏడాది ప్రజలను ఆకర్షించడమే కాకుండా, జాతీయ స్థాయిలో చర్చలకు దారితీసిన అనేక వైరల్ వీడియోలు మన ముందుకు వచ్చాయి. మతపరమైన సమావేశాలలో జరిగిన యాదృచ్ఛిక సంఘటనల నుండి, వినోద రంగంలోని ఊహించని క్లిప్ల వరకు ప్రతిదీ నెట్టింట హల్చల్ చేశాయి.
ఈ వీడియోలు కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో సర్క్యులేట్ అవ్వడమే కాకుండా, సరిహద్దులు దాటి వివిధ వర్గాల మధ్య చర్చలను ప్రభావితం చేశాయి. గత పన్నెండు నెలల్లో కోట్లాది మందిని ఆకర్షించిన, అత్యంత ప్రభావవంతమైన వీడియోల వివరాలు గమనిస్తే..
ఈ ఏడాది జూలైలో బ్రిటీష్ బ్యాండ్ 'కోల్డ్ ప్లే' నిర్వహించిన "మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్" టూర్ ఈవెంట్ లో జరిగిన ఒక సాధారణ సంఘటన, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మసాచుసెట్స్ ఫాక్స్బరోలోని జిలెట్ స్టేడియంలో ప్రదర్శన సమయంలో జంబోట్రాన్ కెమెరా (కిస్ క్యామ్) అనుకోకుండా ప్రేక్షకులలో ఉన్న ఇద్దరు వ్యక్తులపై ఫోకస్ చేసింది.
వారు మరెవరో కాదు, డేటా ఫోకస్డ్ టెక్ సంస్థ ఆస్ట్రానమర్ (Astronomer) సీఈఓ ఆండీ బైరాన్, అదే కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబోట్. కెమెరా వారిని చూపించినప్పుడు, ఇద్దరూ కౌగిలించుకుంటూ కనిపించారు. అయితే, అందరూ తమను చూస్తున్నారని గమనించిన వెంటనే వారు అక్కడి నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించారు. ఈ దృశ్యాన్ని చూసిన కోల్డ్ ప్లే ఫ్రంట్మాన్ క్రిస్ మార్టిన్, "వారేదో ఎఫైర్ నడుపుతున్నారు.. వారు చాలా సిగ్గుపడుతున్నారు," అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వీడియో టిక్టాక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్షణాల్లో వైరల్ గా మారింది. కోట్లాది మంది వీక్షించారు. తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో నాయకత్వ ప్రవర్తన ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఆస్ట్రానమర్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత బైరాన్, కాబోట్ ఇద్దరినీ సెలవుపై పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బైరాన్ సీఈఓ పదవికి రాజీనామా చేయగా, సహ-వ్యవస్థాపకుడు పీట్ డిజాయ్ తాత్కాలిక బాధ్యతలు స్వీకరించారు. కాబోట్ కూడా కొద్ది రోజుల తర్వాత రాజీనామా చేశారు.
2025 ప్రారంభంలో ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళా అనేక వైరల్ వీడియోలకు కేంద్రంగా మారింది. ఇందులో అందరినీ ఆకట్టుకున్న వీడియో పూలదండలు విక్రయించే ఒక అమ్మాయిది. తన వీడియో వైరల్ గా మారిని తర్వాత మోనాలిసా మస్తు పాపులారిటీ పొందింది. భారీ జనసందోహం మధ్య ప్రశాంతంగా రుద్రాక్షలు, మాలలు విక్రయిస్తున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆమె ప్రశాంతత, ముఖకదలికలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వీడియోలు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే, అనుకోకుండా వెంటనే వచ్చిన ఈ పాపులారిటీ కొన్ని రిస్క్లను కూడా తెచ్చిపెట్టింది. మొత్తంగా, ఇప్పుడు మోనాలిసా ఎంటర్టైన్మెంట్ రంగంలో అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఆమెకు అవకాశాలు లభించాయి.
2025లో అత్యంత గుర్తింపు పొందిన వైరల్ విజువల్స్లో 'లబూబూ' (Labubu) ఒకటి. హాంగ్ కాంగ్ ఆర్టిస్ట్ కాసింగ్ లంగ్ సృష్టించిన ఈ డిజైనర్ క్యారెక్టర్, పాప్ మార్ట్ (POP MART) బ్లైండ్-బాక్స్ సేకరణల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. పెద్ద కళ్ళు, పదునైన దంతాలు కలిగిన ఈ బొమ్మ, కొన్నేళ్లుగా నిచ్ డిజైనర్-టాయ్ సర్కిల్లలో ఉన్నప్పటికీ, ఈ ఏడాది షార్ట్-వీడియో ప్లాట్ఫారమ్ల ద్వారా మెయిన్స్ట్రీమ్లోకి ప్రవేశించింది.
అన్బాక్సింగ్ క్లిప్లు, షెల్ఫ్ టూర్లు, లబూబూ హంట్స్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్టాక్, జియాహోంగ్షు లో రచ్చలేపాయి. సీల్ చేసిన బాక్సుల నుండి అరుదైన బొమ్మలను తీసినప్పుడు క్రియేటర్లు ఇచ్చే రియాక్షన్స్ వైరల్ అయ్యాయి. దాని ఎక్స్ప్రెసివ్ ఫేస్, కొంటె చిరునవ్వు, గోతిక్-క్యూట్ లుక్ భాష, సాంస్కృతిక అడ్డంకులను దాటి వైరల్ అయ్యాయి.
ఊహించని విధంగా 2025లో మరొక ఆసక్తికరమైన వైరల్ ట్రెండ్ పుట్టుకొచ్చింది. "ధురంధర్" సినిమా విడుదలైన తర్వాత, అందులో పాకిస్తానీ గ్యాంగ్స్టర్ రెహ్మాన్ డకైత్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటన ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విపరీతంగా వైరల్ అయ్యింది.
అక్షయ్ ఖన్నా స్క్రీన్ ప్రెజెన్స్, ముఖ్యంగా అతని హావభావాలు, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీకి సంబంధించిన చిన్న క్లిప్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. "రెహ్మాన్ డకైత్ ఎంట్రీ సాంగ్"గా గుర్తింపు పొందింది.
చైనాలో గాయకుడు వాంగ్ లీహోమ్తో కలిసి హ్యూమనాయిడ్ రోబోలు డ్యాన్స్ చేసిన క్లిప్, ఈ ఏడాది అత్యంత ఎక్కువగా షేర్ అయిన టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ వీడియోలలో ఒకటిగా నిలిచింది. ఈ ఫుటేజీపై ఎలాన్ మస్క్ బహిరంగంగా స్పందించడంతో దీనికి మరింత క్రేజ్ వచ్చింది.
అంతర్జాతీయ మీడియా దీనిని విస్తృతంగా కవర్ చేసింది. ఈ వీడియో రోబోటిక్స్, ఆటోమేషన్, సాంస్కృతిక ప్రదర్శనలకు సంబంధించిన విస్తృత చర్చలకు దారితీసింది. భవిష్యత్తులో వినోద రంగం ఎలా ఉండబోతోందనే చర్చను ఇది లేవనెత్తింది.
స్టాండ్-అప్ కామిక్ సమయ్ రైనా రూపొందించి హోస్ట్ చేసిన "ఇండియాస్ గాట్ లేటెంట్" (India's Got Latent) షో, 2025లో అత్యంత చర్చనీయాంశమైన వైరల్ ఫార్మాట్లలో ఒకటిగా నిలిచింది. రణవీర్ అల్లాబాడియా (బీర్బైసెప్స్), ఇతర అతిథులను కలిగి ఉన్న ఈ షో, వాస్తవానికి సెన్సార్ చేయని, పెద్దల కోసం ఉద్దేశించిన కామెడీ స్పేస్గా రూపొందించారు.
అయితే, షోలోని చిన్న క్లిప్లు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, ఎక్స్లో వైరల్ అయినప్పుడు వివాదం చెలరేగింది. కొన్ని జోకులు, కామెంట్స్ పై విమర్శలు వచ్చాయి. టికెట్లు కొని చూసే వారికి మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా కంటెంట్ చేరుతున్నప్పుడు క్రియేటర్లు ఎంత బాధ్యతగా ఉండాలనే ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తారు. రణవీర్ అల్లాబాడియా ఈ విమర్శలకు కేంద్ర బిందువుగా మారారు. బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.