మంచు కింద దాగిన రహస్యం...
ఈ రూప్ కుండ్ సరస్సును చూడటానికి ప్రతి సంవత్సరం చాలా మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. దట్టమైన అడవుల మధ్యలో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే.. సముద్ర మట్టానికి 5వేల మీటర్లపైగా ఎత్తులో మంచుతో గడ్డకట్టిన సరస్సు ఒకటి ఉంటుంది. అదే రూప్ కుండ్ సరస్సు. దీని వెడల్పు కేవలం 40 మీటర్లు మాత్రమే. దాదాపు ఇది ఎప్పుడూ మంచుతో గడ్డకట్టుకొనే ఉంటుంది. కానీ.. సంవత్సరం మొత్తంలో ఏదో ఒక సమయంలో మాత్రమే మంచు కొద్దిగా కరుగుతుంది. అప్పుడు ఈ అస్థిపంజరాలు కనపడతాయి. ఇక్కడ అస్థిపంజరాలు ఉండటాన్ని 1942లో హరి కిషన్ మాద్వాల్ అనే ఫారెస్ట్ రేంజర్ కనుగొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన సైనికుల ఎముకలు అని మొదట అనుకున్నారు. కానీ, పరిశోధనల్లో అవి శతాబ్దాల నాటి ప్రాచీన అస్థిపంజరాలు అని తేలింది.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఈ అస్థిపంజరాల సరస్సు వెనక చాలా కథలు వినపడుతూ ఉంటాయి. భయంకరమైన వడగండ్ల వాన పడి చనిపోయారని అక్కడివారు నమ్ముతారు. ఆ సరస్సులో లభించిన అస్థిపంజరాల పుర్రెలపై గుండ్రని వస్తువుల కారణంగా ఏర్పడిన గాయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే, ఆకాశం నుంచి పడిన అతి పెద్ద వడగండ్ల వాన కారణంగా చనిపోయారని కొందరు నమ్ముతుంటారు.
అయితే, తాజా నివేదికల ప్రకారం ఈ అస్థిపంజరాలు ఒకే సమూహానికి చెందినవి కావు. ఇవి దాదాపు 1,000 సంవత్సరాల వ్యవధిలో, వేర్వేరు సమయాల్లో మరణించిన వేర్వేరు వ్యక్తులవని తేలింది. మరీ విస్తుపోయే విషయమేమిటంటే.. వీరిలో కొందరు భారతదేశానికి చెందినవారు కూడా కారు. వారి DNA ఆగ్నేయాసియా , మధ్యధరా ప్రాంతాలకు (Mediterranean) చెందిందని తేలింది. అంటే ఈ ప్రదేశం శతాబ్దాలుగా ఎన్నో విషాదాలను చూసింది, కానీ అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు.