బ్రెడ్ పకోడీలో పెట్టే కూరే దీనికి ఎక్కువ రుచిని అందిస్తుంది. దీన్నే ముందుగా తయారు చేసుకోవాలి. ఇందుకోసం బంగాళదుంపలను బాగా ఉడకబెట్టి చేతితోనే మెదిపి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టూ, కారం, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శెనగపిండిని తీసుకొని అందులో కొద్దిగా వాము, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి పల్చగా కలుపుకోవాలి. ఇది మరీ చిక్కగా ఉంటే బ్రెడ్ పకోడీలు క్రిస్పీగా రావు. శెనగపిండి మిశ్రమంలో ఒక చెంచా నూనె కూడా వేడి చేసి వేస్తే ఇవి మరింత కరకరలాడుతూ వస్తాయి.