‘ అల్టీమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్’ పేరిట ఈ రైలు జూన్ 9వ తేదీన హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో బయలుదేరుతుంది. ఈ టూర్ కి వెళ్లడానికి అందరూ సికింద్రాబాద్ కి రావాల్సిన అవసరం లేదు. నల్గొండ, గుంటూరు, తెనాలి స్టేషన్స్ లో ఆగుతూ వెళ్తుంది. మీకు దగ్గరలో ఉన్న స్టేషన్ లో మీరు ట్రైన్ ఎక్కొచ్చు. కేవలం రైలులో ప్రయాణించడమే కాదు.. మీ హోటల్ రూమ్స్, మీ ఫుడ్, మీరు తిరిగి చూడాల్సిన ప్రదేశాలన్నీ.. అన్నింటినీ ఐఆర్సీటీసీ చూసుకుంటుంది. ఇవన్నీ ఈ ప్యాకేజీ కిందకే వస్తాయి. జూన్ 9వ తేదీన మధ్యాహ్నం 2గంటల 20 నిమిషాలకు సికింద్రాబాద్ లో రైలు బయలు దేరుతుంది.
మరుసటి రోజు ఉదయం అంటే జూన్ 10వ తేదీన దాదాపు 9 గంటలకు తమిళనాడు లోని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు. అక్కడికి మీరు చేరుకోగానే రైల్వే సిబ్బంది మీ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటారు. వాళ్లే స్వయంగా ఏసీ వాహనంలో ఊటీ తీసుకువెళతారు. అక్కడ హోటల్ రూమ్స్ కూడా వాళ్లే బుక్ చేస్తారు. మీరు వెళ్లి చెక్ ఇన్ అవ్వడమే. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం ఊటీలోని ఫేమస్ బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ అన్నీ రైల్వే సిబ్బందే మీకు దగ్గరుండి చూపిస్తారు. అవి చూసిన తర్వాత.. రాత్రికి ఊటీలోనే బస చేస్తారు. రాత్రి భోజనం కూడా వాళ్లే అందిస్తారు.
ఆ తర్వాతి రోజు ఊటీలో మిగిలిన ఇతర ప్రదేశాలను ఓపికగా తిప్పి చూపిస్తారు. మీరు ఊటీలో చూడాల్సిన అన్ని ప్రదేశాలకు తీసుకువెళతారు. టీ తోటలు, చాక్లెట్ ఫ్యాక్టరీ, వాటర్ ఫాల్స్ అన్నీ చూసేసిన తర్వాత తిరిగి మళ్లీ హోటల్ కి చేరుకొని రెస్ట్ తీసుకుంటారు. నాలుగో రోజు మీరు హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత.. ఊటీ సమయంలో మరో పర్యాటక ప్రదేశం కూనూరు తీసుకువెళతారు. అక్కడ సరదాగా గడిపిన తర్వాత మళ్లీ రాత్రికి ఊటీ వచ్చి.. అక్కడే రెస్ట్ తీసుకుంటారు.
మరుసటి రోజు ఊటీలో మీరు బ్రేక్ ఫాస్ట్ చేసి హోటల్ చెక్ అవుట్ చేస్తే.. మళ్లీ ఐఆర్సీటీసీ సిబ్బంది.. మిమ్మల్ని స్పెషల్ వెహికిల్ లో కోయంబత్తూరు తీసుకువస్తారు. అక్కడ మళ్లీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మీ కోసం రైలు సిద్ధంగా ఉంటుంది. ఈ సారి మీరు శబరి ఎక్స్ ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది. అంతే.. ట్రైన్ ఎక్కి పడుకుంటే.. తర్వాతి రోజు ఉదయానికి మీరు మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు.