Motivational story: మనలో చాలా మంది కష్టం వచ్చినప్పుడు కంగారు పడుతారు. కోపంతో ఊగిపోతుంటారు లేదా బాధలో కుంగిపోతుంటారు. అయితే కష్టం వచ్చినప్పుడు ఓపికగా ఉండాలని చాటే ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక రోజు బుద్ధుడు చెట్టు కింద ధ్యానం చేస్తుంటారు. ధ్యానం ముగిసిన తర్వాత కొంత దాహం వేస్తుంది. వెంటనే దగ్గరలో ఉన్న తన శిష్యుడిని పిలిచి, “వెళ్లి చెరువులో నుంచి కొంత నీళ్లు తెచ్చి ఇవ్వు” అని చెప్తారు.
25
చెరువు మురికిగా
శిష్యుడు ఒక చిన్న పాత్ర తీసుకొని చెరువు దగ్గరకు వెళ్తాడు. అయితే ఆ సమయంలో కొన్ని జంతువులు చెరువు దాటుతూ వెళ్తుంటాయి. దీంతో నీరు మురికిగా మారి, తాగడానికి పనికిరాకుండా కనిపించింది. శిష్యుడు తిరిగి వచ్చి, “ప్రభూ, నీరు మురికిగా ఉంది, తాగడానికి వీలులేదు” అని చెప్తాడు.
35
బుద్ధుడి సమాధానం ఏంటంటే.?
బుద్ధుడు చిరునవ్వుతో, “ఏం పర్లేదు, కొంతసేపు వేచి చూడు. ఆ తర్వాత వెళ్లి నీరు తీసుకురా” అని చెప్తారు. దీంతో శిష్యుడు.. అదేంటి మురికిగా ఉన్న నీరును కాసేపు ఆగి తీసుకురమ్ముంటున్నారని ఆలోచిస్తాడు. కొంత సమయం గడిచిన తరువాత ఆయన మళ్లీ, “ఇప్పుడు వెళ్లి నీళ్లు తెచ్చి చూడు” అన్నారు. శిష్యుడు వెళ్లి చూశాడు — ఈసారి నీరు స్వచ్ఛంగా, అద్దంలా కనిపించింది.
శిష్యుడు ఆశ్చర్యంతో, “ప్రభూ, ఏం మాయ చేశారు?” అని అడిగాడు. బుద్ధుడు బదులిస్తూ.. “ఏ మాయా లేదు బాబూ, ఓపిక మాత్రమే. జంతువులు నీటి నుంచి వెళ్లినప్పుడు చెరువు మురికిగా మారింది. కానీ కొంత సమయం గడిచాక మట్టి కిందికి జారుకుంది. దీంతో నీళ్లు మళ్లీ పారదర్శకంగా మారాయి. మన జీవితంలో కూడా అంతే కష్టాలు వస్తాయి. అలాంటి సమయంలో ఓపికగా ఉంటే సమయం మనకు అనుకూలంగా మారుతుంది. అలాగే కోపం వచ్చినప్పుడు మన మనస్సు మురికిగా మారుతుంది. కానీ కొంత సమయం గడిస్తే, కోపం చల్లబడుతుంది, మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది.”
55
సందేశం ఏంటంటే.?
మనిషి కోపంతో ఉన్నప్పుడు చేసే పనులు, చెప్పే మాటలు తరచుగా తప్పుగా ఉంటాయి. కాబట్టి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం ఇవ్వాలి. మనస్సు ప్రశాంతమైతే నిర్ణయాలు కూడా సరైనవిగా ఉంటాయి. అదే విధంగా కష్టం శాశ్వతం కాదనే విషయాన్ని గ్రహించాలి. కొన్ని ప్రశ్నలను కాలానికి వదిలేస్తేనే జవాబులు వస్తాయనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తోంది.