90వ దశకంలో పుట్టిన వారికైతే ఈ పాట ఒక జ్ఞాపకం మాత్రమే కాదు.. చిన్ననాటి సాయంత్రాల్ని గుర్తు చేసే ఓ మధురానుభూతి. ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్, షార్ట్ వీడియోల్లో ఈ పాట తరచూ వినిపిస్తూనే ఉంటుంది. కాలం మారినా, ఈ పాటలోని భావం మాత్రం ఎప్పటికీ పాతగా మారలేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సీరియల్లలో ‘అమృతం’ ముందువరుసలో ఉంటుంది. ఈ సీరియల్కు గంగరాజు గుణ్ణం కాన్సెప్ట్ రూపొందించడంతో పాటు రచన, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ జస్ట్ ఎల్లో బ్యానర్పై ఈ సీరియల్ రూపొందింది.
అచ్చ తెలుగు హాస్యాన్ని, సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలతో కలిపి ప్రేక్షకులకు అందించడం ఈ సీరియల్ ప్రత్యేకత. అసభ్యతకు, డబుల్ మీనింగ్ సంభాషణలకు తావివ్వకుండా పరిశుభ్రమైన హాస్యాన్ని అందించగలిగింది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ సీరియల్ను ఆదరించారు. అప్పట్లో టీఆర్పీ రేటింగ్స్లో అగ్రస్థానంలో నిలవడానికి ఇదే ప్రధాన కారణం.
ఈ సీరియల్ మరో విశేషం ఏమిటంటే.. అనేక మంది దర్శకులకు ఇది ఒక ప్లాట్ ఫామ్ గా నిలిచింది. మొత్తం 11 మంది దర్శకులు ఈ సీరియల్ ద్వారా పరిచయమయ్యారు. వారిలో చంద్రశేఖర్ యేలేటి తర్వాత ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, సాహసం, మనమంతా వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి 30 ఎపిసోడ్లకు ఎస్.ఎస్. కంచి దర్శకత్వం వహించగా, అమృతం పాత్రలో నటించిన హర్షవర్ధన్, సర్వం పాత్రలో కనిపించిన వాసు ఇంటూరి కూడా కొన్ని ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు.