Vande Bharat Express : ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుండి ఐటీ సిటీ బెంగళూరు, టెంపుల్ సిటీ తిరుపతికి అనేక రైళ్లు నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండు నగరాలను విజయవాడతో పాటు మరికొన్ని పట్టణాలను కనెక్ట్ చేస్తూ వందేభారత్ రైలు నడిపేందుకు సిద్దమయ్యింది. దీంతో తెలుగు ప్రజలు మరింత ఈజీగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని తొందరగా దర్శించుకోవచ్చు. ఈ వందేభారత్ ట్రైన్ ప్రయాణం సమయాన్ని విజయవాడ, బెంగళూరు మధ్య ప్రయాణ సమయాన్ని కూడా చాలా తగ్గిస్తుంది.
ప్రస్తుతం విజయవాడ నుండి బెంగళూరుకు ట్రైన్ లో వెళ్లాలంటే 12 గంటలకు పైనే సమయం పడుతుంది... అంటే సగం రోజు ప్రయాణానికే సరిపోతుంది. అయితే హైస్పీడ్ వందే భారత్ అందుబాటులోకి వస్తే ఈ విజయవాడ-బెంగళూరు మధ్య ప్రయాణ సమయం కేవలం తొమ్మిది గంటలే. అంటే దాదాపు మూడు నుండి నాలుగు గంటల సమయం ఆదా అవుతుంది. ఇదే సమయంలో కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ-తిరుపతి మధ్య ప్రయాణం సాగించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకను కలుపుతూ మరో కొత్త వందేభారత్ ట్రైన్ నడిపేందుకు రైల్వే శాఖ సిద్దమయ్యింది. ఈ రైలు ఏపీలోని విజయవాడ నుండి కర్ణాటక రాజధాని బెంగళూరుకు నడుస్తుంది. వారంలో ఆరురోజుల పాటు ఈ రైలు అందుబాటులో ఉంటుంది... కేవలం మంగళవారం మాత్రమే అందుబాటులో ఉండదు. విజయవాడ నుండి ప్రతిరోజు తెల్లవారుజామున 5.15 గంటలకు బయలుదేరుతుంది... 2.15 కు బెంగళూరు చేరుకుంటుంది. అలాగే 2.45 కు బెంగళూరు నుండి తిరుగుపయనమై రాత్రి 11.45 కు విజయవాడకు చేరుకుంటుంది.
ఈ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. విజయవాడలో తెల్లవారుజామున ప్రారంభమైతే ఉదయం 9.45 గంటలకు తిరుపతి చేరుకోవచ్చు. అక్కడినుండి తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శనం తొందరగా చేసుకుంటే ఇదే రైలులో తిరిగి విజయవాడకు చేరుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.55కి ఈ వందేభారత్ తిరుపతి స్టేషన్ కు చేరుకుంటుంది.
ఐటీ సిటీ బెంగళూరుకు ఆంధ్ర ప్రదేశ్ నుండి నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. వారాంతాల్లో అయితే మరింత ఎక్కువమంది రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ విజయవాడ, బెంగళూరు మధ్య కేవలం కొండవీడు ఎక్స్ ప్రెస్ మాత్రమే నడుస్తోంది... మచిలీపట్నం నుండి యశ్వంత్ పురాకు వెళ్లే ఈ రైలు 3 రోజులు మాత్రమే నడుస్తుంది. దీంతో మిగతారోజుల్లో ఈ నగరాల మధ్య ప్రయాణించేవారు బస్సులనో లేదంటే విమానాన్నో ఆశ్రయించాల్సి వచ్చేది.
అయితే వందే భారత్ రైలు అందుబాటులో రావడంతో విజయవాడ, బెంగళూరు మధ్య ప్రయాణం మరింత సులువు కానుంది.. వేగవంతమైన ప్రయాణంతో సమయం కూడా ఆదా కానుంది. తిరుపతికి వెళ్లే శ్రీవారి భక్తులకు కూడా ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. విజయవాడ, బెంగళూరు మధ్య వందేభారత్ రైలు నడపడంపై ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.