
ఇంగ్లాండ్-భారత్ మధ్య ఐదవ టెస్ట్ జూలై 31న లండన్లోని కెనింగ్టన్ ఓవల్ వేదికగా ప్రారంభమైంది. సిరీస్ను 2-2గా సమం చేయాలని చూస్తున్న భారత జట్టు ఈ మ్యాచ్ లో కూడా టాస్ కోల్పోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలీ పోప్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.
దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేస్తోంది. వరుసగా ఐదో టెస్ట్లో కూడా కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ ఓడిపోయారు. మొత్తంగా భారత పురుషుల జట్టు అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా 15వ సారి టాస్ ను ఓడిపోయింది.
ఉదయం 10:43కు (లండన్ స్థానిక సమయం) చిరుజల్లులు ప్రారంభమవడంతో మైదానంపై కవర్లు కప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ కవర్లు తొలగించారు. దీంతో టాస్ కాస్త ఆలస్యం అయింది. టాస్ పడిన తర్వాత మళ్లీ చిరుజల్లులు పడుతుండటంతో మ్యాచ్ కొంత సమయం ఆలస్యంగా ప్రారంభం అయింది.
నాసర్ హుస్సేన్ పిచ్ రిపోర్ట్ ను ప్రస్తావిస్తూ.. ఓవల్ గ్రౌండ్ లో ఇప్పటివరకు చాలా మంది కెప్టెన్లు టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటారు. ఇప్పుడు ఇంగ్లాండ్ అదే చేసిందని తెలిపారు. మైదానంపై గడ్డి కనిపించినప్పటికీ, కొన్ని ప్రదేశాల్లో బేర్ పాచెస్ ఉన్నాయి. ఇది బౌలర్లకు సహకరించనుందనే అంచనాలు ఉన్నాయని తెలిపారు.
టాస్ పడిన తర్వాత భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ మాట్లాడుతూ.. "టాస్ కోల్పోయినా, మ్యాచ్ గెలవడమే మాకు ముఖ్యం. మేం ప్రతీ మ్యాచ్ గెలవాలన్న లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నాం. 5-10% ఎక్స్ట్రా ఎఫర్ట్ వల్లే విజయాలు సాధ్యపడతాయి" అని చెప్పారు. అలాగే, ఆకాశ్ దీప్ అంషుల్ కాంబోజ్ స్థానంలో జట్టులోకి వచ్చారు. కరుణ్ నాయర్ కు కూడా జట్టులో చోటుదక్కింది.
భారత జట్టు ప్లేయింగ్ XI)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ జట్టు ప్లేయింగ్ XI
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేకబ్ బెథెల్, జేమీ స్మిత్ (వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్
మాంచెస్టర్ టెస్ట్లో గాయం కారణంగా రిషబ్ పంత్ మ్యాచ్ మధ్యలోనే దూరం అయ్యారు. ఇప్పుడు ఐదవ టెస్ట్కు కూడా దూరంగా ఉన్నారు. గాయం తీవ్రత అధికంగానే ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక మూడు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉన్న బుమ్రా కూడా ఈ మ్యాచ్లో ఆడటం లేదు. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాను కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత జట్టు కీలక ఆటగాళ్లను కోల్పోయింది.
ఇంగ్లాండ్ జట్టుకు బెన్ స్టోక్ దూరం అయ్యారు. 5వ టెస్టుకు ఓలీ పోప్ కెప్టెన్ గా ఉన్నారు. ఇంగ్లాండ్ తన జట్టులో స్పిన్నర్కు కూడా చోటు ఇవ్వలేదు. ఇది పిచ్ స్వభావాన్ని బట్టి తీసుకున్న వ్యూహంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కాగా, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాట్లాడుతూ, "గిల్ నాయకత్వంలో భారత జట్టు ఎప్పుడూ తలవంచదు అనే భావన కలిగిస్తోంది. అతను జట్టులో పోరాట స్ఫూర్తిని పెంచుతున్నాడు" అని ప్రశంసించారు. టాస్ విషయంలో గిల్కు కలిసిరాకపోయినా, మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు సిరీస్ను 2-2గా సమం చేయాలని చూస్తోంది.