Abhigyan Kundu : వామ్మో ఏంటి కొట్టుడు.. IPL వేలానికి ముందు ఆసియా కప్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్ !

Published : Dec 16, 2025, 03:22 PM ISTUpdated : Dec 16, 2025, 04:31 PM IST

Abhigyan Kundu : ఆసియా కప్ 2025లో భారత అండర్-19 స్టార్ అభిజ్ఞాన్ కుందు మలేషియాపై డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. 125 బంతుల్లో 209 పరుగులు చేసి, అంబటి రాయుడు రికార్డును బద్దలు కొట్టాడు.

PREV
14
డబుల్ సెంచరీతో అంబటి రాయుడు రికార్డ్ బద్దలు కొట్టిన అభిజ్ఞాన్ కుందు

దుబాయ్ లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ సంచలనం అభిజ్ఞాన్ కుందు చరిత్ర సృష్టించాడు. మంగళవారం మలేషియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ముంబై వికెట్ కీపర్-బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 125 బంతుల్లో 209 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. యూత్ వన్డేల చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

కుందు తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 23 ఏళ్ల నాటి అంబటి రాయుడు రికార్డును అధిగమించడమే కాకుండా, జట్టు స్కోరును 408 పరుగుల భారీ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.

రికార్డుల మోత మోగించిన అభిజ్ఞాన్ కుందు

మలేషియా బౌలర్లపై విరుచుకుపడిన అభిజ్ఞాన్ కుందు కేవలం 121 బంతుల్లోనే తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది అండర్-19 వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన జోరిచ్ వాన్ షాల్క్‌విక్ (145 బంతులు) పేరిట ఉండేది.

కుందు తన ఇన్నింగ్స్‌లో మొత్తం 17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు బాదాడు. 125 బంతుల్లో 209 పరుగులతో అజేయంగా నిలిచిన కుందు.. 2002లో ఇంగ్లండ్‌పై అంబటి రాయుడు సాధించిన 177 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, ఇదే టోర్నీలో యూఏఈపై వైభవ్ సూర్యవంశీ చేసిన 171 పరుగుల రికార్డును కూడా కుందు అధిగమించాడు.

24
ప్రపంచ స్థాయిలో రెండో అత్యధిక స్కోరు

అండర్-19 వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన జాబితాలో అభిజ్ఞాన్ కుందు రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు జోరిచ్ వాన్ షాల్క్‌విక్ ఉన్నాడు. అతను 2025 జూలైలో జింబాబ్వేపై 215 పరుగులు చేశాడు. కుందు ఇన్నింగ్స్ ఆసియా కప్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది.

యూత్ వన్డేల్లో టాప్ స్కోరర్లు

జోరిచ్ వాన్ షాల్క్‌విక్ (దక్షిణాఫ్రికా) - 215 (జింబాబ్వేపై, 2025) అభిజ్ఞాన్ కుందు (భారత్) - 209* (మలేషియాపై, 2025) హసిత్ బోయగోడ (శ్రీలంక) - 191 (కెన్యాపై, 2018)

34
భారీ భాగస్వామ్యాలు - 400 దాటిన టీమిండియా

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే (14) త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం దూకుడుగా ఆడి కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం (50) పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అభిజ్ఞాన్ కుందు, వేదాంత్ త్రివేది (90)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 209 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కనిష్క్ చౌహాన్‌తో కలిసి కుందు కేవలం 36 బంతుల్లో 87 పరుగులు జోడించాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు సాధించింది.

44
ఎవరీ అభిజ్ఞాన్ కుందు?

అభిజ్ఞాన్ కుందు ఏప్రిల్ 30, 2008న జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతను ఎడమ చేతి వాటం బ్యాటర్, వికెట్ కీపర్. పాకిస్థాన్‌తో జరిగిన మునుపటి మ్యాచ్‌లో కుందు 22 పరుగులు చేయడంతో పాటు వికెట్ల వెనుక రెండు క్యాచ్‌లు కూడా పట్టాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో కుందు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల్లో 263 సగటు, 151.14 స్ట్రైక్ రేట్‌తో అతను మొత్తం 263 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటంతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.

నా రికార్డును నేనే బద్దలు కొడతాను

మ్యాచ్ అనంతరం కుందు తన ప్రదర్శనపై స్పందిస్తూ, "నాకౌట్ దశలోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించడమే నా లక్ష్యం. అంబటి రాయుడు రికార్డును బద్దలు కొట్టడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో పెద్ద టోర్నీలలో నా రికార్డును నేనే బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తాను. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయని భావించాను. ఎప్పుడు గేర్లు మార్చాలో నాకు తెలుసు, అందుకే వికెట్‌పై నిలబడటంపైనే దృష్టి పెట్టాను" అని పేర్కొన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories