Petrol Price: మ‌రోసారి భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. లీట‌ర్ ధ‌ర ఎంత‌కు చేరిందో తెలుసా?

Published : May 25, 2026, 09:18 AM IST

Petrol Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇంధన ధరలను సవరించాయి. దీంతో సోమ‌వారం దేశ‌వ్యాప్తంగా పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి. 

PREV
15
వరుసగా నాలుగోసారి ధరల సవరణ

గత కొన్ని వారాలుగా ఇంధన ధరల్లో వరుస మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో ధరలు పెరిగిన తర్వాత ఇప్పుడు నాలుగోసారి పెంపు అమల్లోకి వచ్చింది. తాజాగా సోమ‌వారం (ఈరోజు) లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున ధరలు పెరిగాయి. సవరించిన రేట్లు సోమవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా వ్యక్తిగత వాహనాలు ఉపయోగించే వారు, టాక్సీ డ్రైవర్లు, సరుకు రవాణా రంగానికి చెందిన వారు ఈ పెరుగుదల ప్రభావాన్ని నేరుగా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

25
ప్రధాన నగరాల్లో తాజా ఇంధన ధరలు

ధరల పెంపు తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు కొత్త స్థాయికి చేరుకున్నాయి.

* ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.102.12, డీజిల్‌ రూ.95.20గా ఉంది.

* ముంబయిలో పెట్రోల్‌ రూ.111.21, డీజిల్‌ రూ.97.83 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* చెన్నైలో పెట్రోల్‌ రూ.107.77, డీజిల్‌ రూ.99.55గా ఉంది.

దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.115.58కు చేరగా, డీజిల్‌ రూ.103.74 వద్ద ఉంది. విజయవాడలో పెట్రోల్‌ రూ.117.19, డీజిల్‌ రూ.104.88గా నమోదైంది. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.117.59, డీజిల్‌ రూ.105.28కు చేరింది.

35
అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణం

ప్రపంచ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారాయి. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ భయాందోళనలు ముడిచమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి మార్గంలో అంతరాయాలు ఏర్పడటంతో సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్‌ ధరలు వేగంగా ఎగబాకాయి. బ్యారెల్‌ ధర 100 డాలర్లకు పైగా చేరడంతో దిగుమతులపై ఆధారపడే దేశాలపై అదనపు వ్యయం పడుతోంది. భారతదేశం తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నందున ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపిస్తోంది.

45
చమురు కంపెనీలపై పెరిగిన ఆర్థిక ఒత్తిడి

ముడిచమురు ధరలు పెరిగినా కొంతకాలంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగదారులపై పూర్తి భారం మోపకుండా ధరలను స్థిరంగా కొనసాగించాయి. అయితే కొనుగోలు వ్యయం పెరుగుతుండటంతో సంస్థలపై భారీ ఆర్థిక ఒత్తిడి ఏర్పడినట్లు సమాచారం. దిగుమతి ఖర్చులు, రవాణా వ్యయం, రూపాయి మారకం విలువలో మార్పులు కలిసి చమురు కంపెనీల లాభదాయకతను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నష్టాలను తగ్గించుకునేందుకు ధరల సవరణ అవసరమైందని అధికారులు వివరిస్తున్నారు.

55
సాధారణ ప్రజలపై ప్రభావం ఎలా ఉండొచ్చు?

ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, నిత్యావసర వస్తువులు, సరుకు రవాణా సేవల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి, రోజువారీ ప్రయాణాలపై ఆధారపడే ఉద్యోగులు, చిన్న వ్యాపారులు అదనపు ఖర్చులను భరించాల్సి రావచ్చు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గకపోతే భవిష్యత్తులో కూడా ఇంధన ధరల్లో మార్పులు కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, పశ్చిమాసియా పరిణామాలు, చమురు సరఫరా స్థితిగతులు దేశీయ ఇంధన ధరల దిశను నిర్ణయించనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories