Petrol Diesel GST: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ మళ్లీ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఈ నిర్ణయం అమలైతే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.?
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్ ఎందుకు?
ఇటీవలి కాలంలో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే పలుమార్లు ధరలు పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో వ్యాపార వర్గాలు, పరిశ్రమల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నాయి. ప్రస్తుతం ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా పన్నులు విధిస్తున్నాయి. దీంతో అసలు ధరతో పోలిస్తే వినియోగదారుడు చెల్లించే ధర గణనీయంగా పెరుగుతోంది. జీఎస్టీ అమల్లోకి వస్తే ఈ పన్నుల వ్యవస్థలో మార్పులు జరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
25
ప్రస్తుతం పెట్రోల్ ధరలో ఎంత పన్ను ఉంది?
ఉదాహరణకు ఢిల్లీలో అమ్మే ఒక లీటర్ పెట్రోల్ అసలు ధర సుమారు రూ.66.29గా ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.11.90 వసూలు చేస్తోంది. అదనంగా ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ రూపంలో రూ.16.03 పన్ను విధిస్తోంది. అలాగే పెట్రోల్ బంక్ డీలర్లకు లీటర్కు సుమారు రూ.4.42 కమిషన్ అందుతుంది. ఈ అన్ని ఖర్చులు కలిసిన తర్వాత వినియోగదారుడు ఒక లీటర్ పెట్రోల్ కోసం దాదాపు రూ.99.51 చెల్లించాల్సి వస్తోంది. అంటే మొత్తం ధరలో దాదాపు రూ.28 వరకు పన్నుల రూపంలోనే వెళ్తోంది.
35
జీఎస్టీ అమల్లోకి వస్తే ధర ఎంత తగ్గవచ్చు?
ఒకవేళ ప్రస్తుత ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ వంటి పన్నులను తొలగించి పెట్రోల్ను పూర్తిగా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. ఉదాహరణకు 18 శాతం జీఎస్టీ విధించినట్లయితే రూ.66.29 అసలు ధరపై సుమారు రూ.11.93 మాత్రమే పన్ను పడుతుంది. డీలర్ కమిషన్ను యథాతథంగా ఉంచినా, మొత్తం ధర సుమారు రూ.78.22కు చేరవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న ధరతో పోలిస్తే లీటర్కు దాదాపు రూ.21 నుంచి రూ.22 వరకు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో వాహనదారులకు నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన ఉపశమనం లభించవచ్చు.
ప్రస్తుతం ప్రతి రాష్ట్రం తనకు అనుకూలంగా వ్యాట్ రేట్లు నిర్ణయించుకుంటోంది. అందుకే ఒక రాష్ట్రంలో పెట్రోల్ ధర తక్కువగా ఉండగా, మరో రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది. జీఎస్టీ అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను విధానం అమలవుతుంది. ఫలితంగా రాష్ట్రాల మధ్య ధరల వ్యత్యాసం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలపై ఉన్న ప్రభావం తగ్గి మార్కెట్లో స్థిరత్వం ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
55
ఇంధన ధరలు తగ్గితే ఇతర వస్తువుల ధరలపై కూడా ప్రభావం
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల కేవలం వాహనదారులకే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలగవచ్చు. రవాణా ఖర్చులు తగ్గితే సరుకుల రవాణా వ్యయం కూడా తగ్గుతుంది. దీని ప్రభావం నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు, ఇతర వినియోగ వస్తువుల ధరలపై పడే అవకాశం ఉంది. ఫలితంగా ద్రవ్యోల్బణం కొంత మేర నియంత్రణలోకి రావచ్చు. అయితే పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం అవసరం. ఎందుకంటే ప్రస్తుతం ఇంధనంపై వచ్చే పన్ను ఆదాయం రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.