న్యూఢిల్లీ: దేశీయంగా ఆర్థిక మందగమన ప్రభావం విమానయానం మీద తీవ్రంగానే కనిపిస్తోంది. రద్దీ అధికంగా ఉండే ప్రస్తుత సీజన్లోనూ కొన్ని మార్గాల్లో టికెట్ల ధరలు, ముందస్తు బుకింగ్ ధర కంటే తక్కువకూ లభించడం దీనికి ఉదాహరణ. జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాక, ఒక్కసారిగా టికెట్ ధరలు పెరిగినా, మిగిలిన సంస్థలు కొత్త విమానాలు సమకూర్చుకుని, సర్వీసులు విస్తరించడమే ప్రస్తుత స్థితికి కారణం అని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు.
undefined
అత్యంత ఆకర్షణీయంగా కనిపించే విమానయాన రంగం.. పలు సంస్థలను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీస్తోంది. నిర్వహణ వ్యయాలు.. ఆదాయాల మధ్య అగాధం పెరిగిపోతే, ఆయా సంస్థలు మూతబడక తప్పదు. దేశీయంగా కింగ్ఫిషర్, జెట్ఎయిర్వేస్ వంటి దిగ్గజ సంస్థలు ఇలాగే మూతబడగా, ఎయిర్ ఇండియాను ప్రభుత్వమే అమ్మకానికి పెట్టిన సంగతి విదితమే. సరైన సమయంలో, తగిన ధరతో, సౌకర్యవంతంగా విమానాలు నిర్వహించడం సవాళ్లతో కూడినదే. ఇలా చేసిన సంస్థలు విజయవంతమవుతుంటే, మిగతా సంస్థలు నష్టాలతో కుదేలవుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, దేశీయంగా తలసరి ఆదాయం బాగా తక్కువ (నెలకు రూ.10,534.. ఈ కారణంగా వెచ్చించే ప్రతిపైసకు తగిన సేవ, ఉత్పత్తిని కోరుకుంటారు.
undefined
విమాన టికెట్లకూ ఇదే సూత్రం వర్తించడం వల్లే, ప్రపంచ దేశాల్లోనే విమాన ఛార్జీలు మనదేశంలోనే తక్కువగా ఉంటున్నాయన్నది విమాన యాన రంగ పరిశ్రమ మాట. ఈ ఏడాది అత్యల్ప ఛార్జీలు ఏడాదిలో చూస్తే, దసరా-దీపావళి పండుగ సీజన్ నుంచి ఏడాది ముగిసి, కొత్త ఏడాదిలో సంక్రాంతి పండుగ వరకు విమాన ప్రయాణానికి గిరాకీ అధికం. అందువల్ల ఈ సీజన్లో విమాన టికెట్ల ధరలు అధికంగా ఉండేవి. ఈసారి 2-3 నెలల ముందుగా బుక్ చేసుకున్న ధరల కంటే కూడా అక్టోబర్ నెలలో విమాన టికెట్ల స్పాట్ ధరలు కొన్నిసార్లు తక్కువగా ఉండటం సంస్థలకు ఆందోళనకరంగా మారింది. సరఫరా (ఆయా మార్గాల్లో విమాన సీట్ల)తో పోలిస్తే, డిమాండ్ (ప్రయాణికుల సంఖ్య) తక్కువగా ఉండటమే ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు.సాధారణంగా నెలల తరవాత ప్రయాణానికి తక్కువ ఛార్జీలతో టికెట్లను విమానయాన సంస్థలు విక్రయిస్తుంటాయి. ప్రస్తుత సీజన్లో ఆఫర్లలో విక్రయించే టికెట్లతో 15 రోజుల తరవాత నుంచే ప్రయాణించే వీలుంటోంది.
undefined
2015 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్యలో రెండంకెల వృద్ధి లభించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ పరిస్థితి మారింది. జనవరి నుంచి జెట్ విమాన సర్వీసులు తగ్గిపోతూ రావడం, మార్చిలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నిలిపి వేయడం, ఏప్రిల్లో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు ఆగిపోవడం వల్ల విమానాల సంఖ్య 530-540కి పరిమితమై, ప్రయాణికుల సంఖ్య తగ్గేందుకు కారణమయ్యాయి. ఇదే సమయంలో ఇతర విమానయాన సంస్థలు టికెట్ల ధరలు భారీగా పెంచాయి. ఫలితంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాభాలు లభించాయి. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఇండిగో, స్పైస్జెట్ ఎక్కువగా, మిగిలిన సంస్థలూ సాధ్యమైనంతగా విమానాలను సమకూర్చుకుని, సేవలు విస్తరించడంతో సెప్టెంబర్ నెలాఖరుకల్లా విమానాల సంఖ్య మళ్లీ 600 దాటి, అక్టోబరుకు 616కు చేరింది.ఆర్థిక మందగమన ప్రభావంతో అరకొరగా వ్యాపారాలు సాగడం, కొత్త ఉద్యోగాలు లేకపోవడం వంటి కారణాలతో మార్చి నుంచి అక్టోబర్ నెల వరకు విమాన ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి బాగా తగ్గింది.
undefined
అందువల్లే అధిక ఛార్జీలు ఉండాల్సిన అక్టోబర్ నెలలో గో ఎయిర్ సంస్థ వార్షికోత్సవం అంటూ రూ.1296 నుంచీ టికెట్లు విక్రయించడం, 15 రోజుల వ్యవధిలోనూ ఈ టికెట్లపై ప్రయాణానికి వీలు కల్పించడం వల్ల మిగతా సంస్థలూ టికెట్ల ధరలు తక్కువగా నిర్ణయించాల్సి వచ్చింది. నవంబర్, ప్రస్తుత డిసెంబర్ నెలలోనూ ఆఫర్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఏడాదిక్రితంతో పోలిస్తే, ఛార్జీలు అక్టోబరులోనే 20 శాతం తక్కువగా ఉన్నట్లు యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసింది. ఆఫర్ల ప్రభావంతో, నవంబర్ నెలలో ప్రయాణికుల సంఖ్యలో 11 శాతానికి పైగా వృద్ధి లభించింది.
undefined
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యా పరంగా ఈ ఏడాది జనవరి - నవంబరు నెలల్లో 13.16 కోట్ల మంది ప్రయాణించారు. 2018 ఇదే సమయంలో ప్రయాణించిన 12.63 కోట్ల మందితో పోలిస్తే, ఈసారి 3.86 శాతం అధికంగా ప్రయాణించారు. విమాన టికెట్ల ధరలు, నిర్వహణ వ్యయాల కంటే తక్కువగా ఉండటం కొనసాగితే మరిన్ని సంస్థలు మూతబడే ప్రమాదం ఉందనే ఆందోళనా సంస్థల నిర్వాహకుల్లో వ్యక్తమవుతోంది. అయితే గిరాకీ ఉంటుందని భావించే సమయాల్లో టికెట్ల ధరలను ముందస్తుగా కూడా ఎక్కువగా చూపడం వల్లే, ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణాను చూసుకుంటున్నారని, సహేతుకంగా ఉంచితే, సంస్థలకూ మేలు కలుగుతుందన్నది విశ్లేషకుల మాట.
undefined