వైసీపీలో నెంబ‌ర్ 1 జ‌గ‌న్ కాదు.. ఆయ‌న స్థానం 2. విజ‌యసాయి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Aug 29, 2026, 05:10 PM IST

Vijayasai Reddy: రాజ్యసభ మాజీ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచే శారు. వైసీపీలో ఉన్న‌స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, పార్టీ నుంచి బయటకు రావడానికి గ‌ల కార‌ణాలను వివ‌రిస్తూ లేఖలో రాసుకొచ్చారు.

PREV
14
నమ్మకద్రోహం చేసి ఉంటే జైలు జీవితం ఉండేది కాదు

తాను ఎప్పుడూ జగన్‌కు ద్రోహం చేయలేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. నిజంగానే నమ్మకద్రోహం చేసే స్వభావం ఉంటే అప్పట్లోనే రాజకీయంగా తనకు అనుకూలమైన మార్గాలను ఎంచుకుని కేసుల నుంచి తప్పించుకునేవాడినని అన్నారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మకంగా ఉన్నందువల్లే వివిధ కేసుల్లో తన పేరు చేరిందని గుర్తుచేశారు.

జగన్ మోహన్ రెడ్డి సుమారు 16 నెలలు జైలు జీవితం గడిపితే, తాను కూడా దాదాపు 15 నెలలు కారాగారంలో ఉన్నానని తెలిపారు. నమ్మకాన్ని వదిలి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరించి ఉంటే అప్పుడే అప్రూవర్‌గా మారే అవకాశం ఉండేదని వ్యాఖ్యానించారు. త‌న‌కు సంబంధం లేని లిక్కర్ కేసులో ఏ-5గా, కాకినాడ సీపోర్టు కేసులో ఏ-2గా చేర్చారని పేర్కొన్నారు.

అయితే గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారినా, అప్పట్లో అధికార వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన సజ్జల పేరు ఏ కేసులోనూ కనిపించకపోవడంపై విజయసాయి ప్రశ్నలు సంధించారు. రాజకీయంగా అధికార పక్షాలతో సన్నిహితంగా ఉంటూ కేసుల నుంచి ఎలా బయటపడాలో తనకు తెలియదని, అలాంటి రాజకీయాలు చేయడం తన స్వభావం కాదని విమర్శించారు.

24
ప్లీనరీలో దాడి జరిగిందంటూ సంచలన ఆరోపణ

2022లో మంగళగిరిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సందర్భంగా తనపై సజ్జల రామకృష్ణారెడ్డి భౌతికంగా దాడి చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ ఘటన పార్టీ అధినేత జగన్‌కు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయన ప్రేక్షకుడిగానే మిగిలిపోయారని పేర్కొన్నారు. ఈ సంఘటనను పార్టీలోని పలువురు ముఖ్య నేతలు కూడా చూశారని తెలిపారు.

అప్పటికే పార్టీలో తన ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయని విజయసాయి ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశాల్లో తన వయసును ప్రస్తావిస్తూ అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తొలగించారని చెప్పారు. అనంతరం ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల ఇన్‌చార్జ్ బాధ్యతలను ఒక్కొక్కటిగా తొలగించారని, చివరకు కోర్ కమిటీ నుంచి కూడా తప్పించారని వివరించారు. 2020 నుంచి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అనేక పరిణామాలు జరిగాయని, వాటిలో మొత్తం 74 సందర్భాలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయని తెలిపారు. ఇంతకాలం పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనేక విషయాలను బయటకు చెప్పకుండా మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు.

34
జగన్‌ను కలవకుండా పార్టీ నేతల మధ్య గోడ కట్టారంటూ విమర్శలు

2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించిన తర్వాత పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో కొందరి జోక్యం పెరిగిపోయిందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర పరిపాలన పూర్తిగా జగన్ చేతుల్లోనే సాగిందా లేక కొందరు కీలక వ్యక్తుల ప్రభావం అధికమైందా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా నేరుగా జగన్‌ను కలిసే పరిస్థితి లేకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారని విమర్శించారు. పార్టీ అధినేతకు ఇతర నాయకులకు మధ్య అడ్డుగోడలా వ్యవహరించారని సజ్జలను ఉద్దేశించి ఆరోపించారు.

పార్టీలో సీనియర్ నాయకులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వంటి నేతలకు ప్రాంతీయ బాధ్యతలు అప్పగించినప్పటికీ, వారందరూ ఒకే వ్యక్తికి రిపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడిందని విజయసాయి అన్నారు. అలాంటి వ్యవస్థలో తన ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టి కొనసాగడం సాధ్యం కాలేదని స్పష్టం చేశారు.

44
పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం అదే..

పార్టీలో తన పాత్రను క్రమంగా తగ్గించడంతో పాటు తీసుకుంటున్న నిర్ణయాలు తనకు ఆమోదయోగ్యంగా లేకపోవడమే రాజీనామాకు కారణమని విజయసాయి రెడ్డి వివరించారు. ఇంకా నాలుగేళ్ల రాజ్యసభ పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ దానిని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. పదవుల కోసం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. పార్టీలో కొనసాగాలంటే కొందరికి తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అది తన వల్ల కాలేదని పేర్కొన్నారు. అందుకే రాజకీయంగా కొత్త మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తాను పార్టీని వీడటానికి జగన్‌పై వ్యక్తిగత ద్వేషం కారణం కాదని, పార్టీలో నెలకొన్న అంతర్గత పరిస్థితులే ప్రధాన కారణమని విజయసాయి తన లేఖలో వివరించే ప్రయత్నం చేశారు.

వైసీపీలో నంబర్ వన్ ఎవరు? అంటూ కొత్త ప్రశ్న

ప్రస్తుతం వైసీపీలో అసలు నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉందనే అంశంపై కూడా విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేరుకు జగన్ పార్టీ అధినేత అయినప్పటికీ, పార్టీ వ్యవహారాల్లో మరొకరి ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. పార్టీలో జ‌గ‌న్ నెంబ‌ర్ 2 అయితే స‌జ్జ‌ల నెంబ‌ర్ 1 అంటూ విజ‌య్ సాయి రెడ్డి అన్నారు. తాను జగన్‌కు ఎప్పటికీ ద్రోహం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోనని స్పష్టం చేశారు. అయితే పార్టీని తన చేతుల్లోకి తీసుకుని, అధినేతను రాజకీయంగా తప్పుదోవ పట్టిస్తూ వ్యవహరించడం తనకు చేతకాదని అన్నారు. తన రాజకీయ ప్రయాణం ఎప్పుడూ బహిరంగంగానే ఉంటుందని, తెరవెనుక రాజకీయాలు చేయనని పేర్కొన్నారు.

కోవర్టు రాజకీయాలు ఎవరు చేస్తున్నారో పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వయంగా ఆలోచించాలని విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. ఇంకా చెప్పాల్సిన అనేక విషయాలు ఉన్నాయని, సరైన సమయంలో మీడియా ద్వారా మరిన్ని అంశాలను వెల్లడిస్తానని సంకేతాలిచ్చారు. విజయసాయి రెడ్డి విడుదల చేసిన ఈ బహిరంగ లేఖ వైసీపీ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చకు దారితీసింది. ఒకప్పుడు జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నేత ఇప్పుడు పార్టీ కీలక నాయకత్వంపైనే బహిరంగంగా ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ఆరోపణలపై వైసీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories