
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 20 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదాన్ని మర్చిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఆటో ఢీకొన్నాయి. చిలకలూరిపేటలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
విజయవాడ నుండి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ప్రయాణికులతో వెళుతున్న ఆటో ఢీకొన్నాయి. చిలకలూరిపేటలోని అడ్డరోడ్డు సెంటర్ లో ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటోలోని ఏడుగురు ప్రయాణికులు స్పాట్ లోనే మరణించారు... మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనాస్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయి భయానక పరిస్థితి కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి పోలీసులు, అంబులెన్సులు చేరుకున్నాయి.. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ కు తరలించారు... డాక్టర్లు వారికి మెరుగై న వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక స్పాట్ లో మరణించినవారి మృతదేహాలను కూడా పోలీసులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
చిలకలూరిపేట మండలం వేలూరరు గ్రామానికి చెందిన కొందరు పుట్టినరోజు వేడుకల కోసం ప్రకాశం జిల్లా కొండమందులూరు వెళ్లారు. పుట్టినరోజు ఫంక్షన్ ముగించుకుని బుధవారం రాత్రి వేలూరుకు తిరుగుపయనం అయ్యారు. అయితే మరికొద్దిసేపట్లో స్వస్థలానికి చేరుకుంటారు అనగా ట్రావెల్స్ బస్సు రూపంలో వారిని మృత్యువు కబళించింది. వీళ్లు ప్రయాణిస్తున్న ఆటోను మితిమీరిన వేగంతో వచ్చిన బస్సు ఢీకొట్టింది... దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
అయితే ఈ ప్రమాదానికి ఆటో డ్రైవరే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అతడు ఫుల్లుగా ఆల్కహాల్ సేవించి ఆటోను నడిపినట్లు... ప్రమాదానికి ఈ నిర్లక్ష్యపు డ్రైవింగే కారణమని స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో ట్రావెల్స్ బస్సులు అతివేగంతో ప్రయాణిస్తాయి... అలాంటి ఓ బస్సు దూసుకొస్తున్నా ఆటో డ్రైవర్ అలర్ట్ కాలేదు. బస్సును కంట్రోల్ చేయడం దాని డ్రైవర్ కు కూడా సాధ్యం కాలేదు... ఇలా ఆటో, బస్సు ఒకదాన్ని ఒకటి ఢీకొనడంతో ఏడుగురి ప్రాణాలు బలయ్యాయి.
ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో ఎక్కువగా మహిళలే ఉన్నాయి. మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మతో పాటు బొంత బాబు కూడా మరణించినవారిలో ఉన్నారు. ఇక ఆటోలోని మిగతా ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు... కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం జరగడం తీవ్ర విచారకరం అని... బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. అధికారుల ద్వారా ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్నారు సీఎం... తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీఎంకు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని... క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
ఇవాళ తెల్లవారుజామున చిలకలూరిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
హోంమంత్రి అనిత సీరియస్...
చిలకలూరిపేట ఘోర రోడ్డు ప్రమాద వివరాలను పల్నాడు అదనపు ఎస్పీకి ఫోన్ చేసి తెలుసుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రమాద తీవ్రత, మృతులు, క్షతగాత్రుల వివరాలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం అని... మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బస్సు వేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యం సహా అన్ని కోణాల్లో విచారణ జరపాలలని హోంమంత్రి అనిత ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి... సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని సూచించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాల రోడ్డు భద్రతా నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు హోంమంత్రి.
రవాణా, వైద్యశాఖ మంత్రులు రియాక్ట్
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రమాదంలో నిండు ప్రాణాలు మృత్యు ఒడికి చేరడం మనసును కలచివేస్తోందని రవాణా మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణాలు గమ్యానికి చేర్చాలి కానీ ఆఖరి మజిలీ కాకూడదన్నారు. ప్రమాద స్థలంలో పరిస్థితిని చక్కదిద్దాలని రవాణా అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిజిహెచ్ సూపరిండెంట్ తో కూడా మాట్లాడినట్లు సత్యకుమార్ తెలిపారు.
గుంటూరు జిజిహెచ్ సూపరిండెంట్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ... ఆసుపత్రికి తీసుకువస్తుండగానే క్షతగాత్రుల్లో ఒకరు మరణించారని తెలిపారు. విషమ పరిస్థితుల్లో ఉన్న మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని చెప్పారు. మిగిలిన నలుగురిలో ఇద్దరికి చిన్నచిన్న గాయాలే అయ్యాయని... వారికి ప్రథమ చికిత్స అందించి డిశ్చార్జ్ చేశామని తెలిపారు. మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నామని... వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జిజిహెచ్ సూపరిండెంట్ వెల్లడించారు.