Published : Apr 30, 2026, 10:38 AM ISTUpdated : Apr 30, 2026, 10:48 AM IST
IMD Rain Alert : ఇరు తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం కొనసాగుతోంది. మధ్యాహ్నం మండుటెండలతో వేసవి… సాయంత్రం, రాత్రి సమయంలో వర్షాలతో వానాకాలం ఫీలింగ్ ఉంటోంది. మే ఆరంభంలో వెదర్ ఎలా ఉంటుందో తెలుసా…?
IMD Rain Alert : ఓవైపు ఎండలు మండిపోతున్నాయి... ఏప్రిల్ చివర్లోనే తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు... అయితే ఈ ఎండలకు ఇప్పుడు వర్షాలు కూడా తోడవుతున్నాయి. మధ్యాహ్నమంతా మండుటెండలు... సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇలా ఒకేరోజు ఎండావాన పరిస్థితులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వచ్చే మే నెలలో ఎండలతో పాటు వర్షాల తీవ్రత కూడా పెరగనుందన్న వాతావరణ సమాచారం కంగారు పెడుతోంది.
26
అల్పపీడనం ప్రభావంతో వర్షాలు..
ఆంధ్ర ప్రదేశ్ లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి... ఒకవైపు ఎండలు మండిపోతే, మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ (ఏప్రిల్ 30, గురువారం) అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఇలా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇదే సమయంలో ఎండల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లోని 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. మరో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. నిన్న (ఏప్రిల్ 29, బుధవారం) నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 44.1°C టెంపరేచర్ నమోదైంది. ఇవాళ కూడా ఇదేస్థాయిలో ఎండలు ఉంటాయని విపత్తు సంస్థ వెల్లడించింది.
36
ఏపీ వెదర్ మ్యాన్ వాతావరణ సమాచారం...
ఆంధ్ర ప్రదేశ్ వెదర్ మ్యాన్ ప్రకారం... ఇవాళ (ఏప్రిల్ 30, గురువారం) కూడా నిన్నటిలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ వడగళ్ల వానల పడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే సాయంత్రానికి తిరుపతి పశ్చిమ ప్రాంతాలతో పాటు ఉత్తర, మధ్య ఆంధ్రప్రదేశ్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
మే మొదటి వారంలో (May 1st week) విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో వర్షాల తీవ్రత పెరుగుతుందని వెల్లడించారు. అదే సమయంలో తిరుపతి, నెల్లూరు, ఒంగోలు దక్షిణ కోస్తా ప్రాంతంలో తీవ్రమైన వడగాల్పులు ఉంటాయన్నారు. తూర్పు రాయలసీమ, విజయవాడ, గోదావరి ప్రాంతాలలో వడగాల్పులు వీస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణలో ఇప్పటికే ఎండావాన పరిస్థితులు కొనసాగుతున్నాయి... మండు వేసవిలోనూ వర్షాలు వదిలిపెట్టడం లేదు. ఇవాళ (ఏప్రిల్ 30, గురువారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలులు, అక్కడక్కడ వడగళ్ల వానలు పడే అవకాశాలుంటాయి… కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
56
హైదరాబాద్ వాతావరణం...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని... సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో మధ్యాహ్నం ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని.. గరిష్ఠంగా 40 డిగ్రీలు, కనిష్ఠంగా 29.2 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
66
అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 మండలాలివే...
ఏప్రిల్ 29 అంటే నిన్న బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో అత్యధికంగా 36.2, నల్గొండ జిల్లా నాంపల్లెలో 31 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. ఇక ఇదే నాగర్ కర్నూల్ జిల్లాలోని వంగూర్ లో 22.2, కల్వకుర్తి లో 15, తండూరులో 13.8 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. నల్గొండ జిల్లా దేవరకొండలో 21.3, గుర్రంపోడ్ లో 21, చింతపల్లిలో 19.4, చందంపేట్ లో 19.3 మి.మీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (M) మండలంలో 14.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటి (TGDPS) వెల్లడించింది,