‘భారత దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి దాడులకు పాల్పడుతోంద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. 1947లో దేశ విభజన జరిగిన నాటి నుంచి దేశం ఏనాడు ప్రశాంతత చూసింది లేదన్నారు.
శాంతి.. శాంతి అంటూ వల్లించే శాంతి వచనాలు వారికి పని చేయవన్నారు. ఇప్పటి వరకు సహనంతో మా చేతులు కట్టేశారు. ఇక పాకిస్థాన్ ఆటలు సాగవన్నారు. మీరు మా దేశంలోకి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి వచ్చి కొడతామని హెచ్చరించారు.
అంతకుముందు తిరంగ ర్యాలీలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జాతీయ జెండా చేతబూని రెపరెపలాడిస్తూ సూమారు మూడు కిలోమీటర్లు నడిచారు. ఆద్యంతం జాతీయ భావం వెల్లివిరియగా.. వేలాది మంది నగర ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని భారత సైన్యం తాలూకు శౌర్యాన్ని పొగిడారు. భారత్ మాతా కీ జై అని నినదిస్తూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు ముందుకి కదలగా వేలాది మంది జాతీయ పతాకాలు చేతబూని వారిని అనుసరించారు.
బెంజి సర్కిల్ వద్ద ర్యాలీ ముగిసిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "తిరంగా యాత్రకు మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానీకానికి నమస్కారాలు. దేశ విభజన జరిగిన నాటి నుంచి మనం ఏనాడు ప్రశాంతత చూడలేదు. కసబ్ లాంటి తీవ్రవాదులు దేశంలోకి చొరబడి 72 గంటల పాటు ఎలాంటి దాడులు చేశారో చూశాం. ముంబయి పేలుళ్లు, కోయంబత్తూరు పేలుళ్లు, గోకుల్ చాట్ పేలుళ్లు, జామా మసీదు పేలుళ్లు, లుంబనీపార్కు పేలుళ్లు వీటన్నింటి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందన్నారు.
పవన్ ఇంకా మాట్లాడుతూ.. ఈ రోజు మనం విజయవాడ నడిబొడ్డున కూర్చుని మాట్లాడుతున్నామంటే అది సరిహద్దుల్లో మన సైనికులు ఉన్నారన్న ధైర్యమే అన్నారు. అదే సరిహద్దు రాష్ట్రాలు అయిన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, హర్యానా... అక్కడ ఇంత ప్రశాంతత ఉండదు. మన దేశానికి మనం చేయగలిగింది ఒకటే.
సైన్యానికి మనం అండగా ఉన్నాం అని ధైర్యం చెప్పడమే. దేశం లోపల ఉన్న సూడో సెక్యులరిస్టులు సెక్యులరిజం ముసుగులో దేశ సైన్యాన్ని బలహీనపరిచే విధంగాగాని, కించపరిచే విధంగాగాని వ్యాఖ్యలు చేస్తే... ఆ వ్యాఖ్యలు చేసిన వారు ఏ స్థాయి వ్యక్తులైనా వారికి బలమైన జవాబు చెప్పి వారి నోరు మూయించడం మనందరి కర్తవ్యం. అని పవన్ స్పష్టం చేశారు.
మురళీ నాయక్ 23 ఏళ్ళ కుర్రాడు. భారత్ మాతాకీ జై చెప్పారు. అటువంటి వారే నిజమైన దేశ భక్తులు.
సెలబ్రిటీలు, హీరోలు ఎవరూ మాట్లాడడం లేదు అంటే వారెవరూ దేశాన్ని నడిపేవారు కాదు. వారు వినోదాన్ని పంచే వారు మాత్రమే.. సెలబ్రటీస్ నుంచి అంతకు మించి దేశభక్తి ఆశించకండి.
దేశభక్తుడు అంటే మురళీ నాయక్ లాంటి వారు. మరణిస్తే దేశాన్ని కాపాడుతూ సైనికుడిగా పోవాలి అనుకున్నారు. అతని తల్లిదండ్రులకు ఏం చెప్పగలం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన శ్రీ మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అని అన్నారు.