Rain Alert : తెలుగు ప్రజలకు మండుటెండల నుండి ఉపశమనం లభించింది. గురువారం ఉదయం నుండే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి... దీంతో వాతావరణం చల్లబడింది. ఈ వానలు ఇవాళ, రేపు (శుక్ర, శనివారం) కూడా కొనసాగు అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇక గుంటూరు, శ్రీకాకుళం,శ్రీ సత్యసాయి, కడప, కర్నూల్, నంద్యాల, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
మిగతా జిల్లాల్లో వర్షాలు కురవకున్నా ఆకాశం మేఘాలతో కమ్ముకుని వాతావరణం చల్లబడుతుంది. ఎండల తీవ్రత తగ్గుతుంది కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
ఇక శనివారం కూడా ఏపీలో వర్షాలు కొనసాగుతాయని తెలిపారు. అల్లూరి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూల్, అనంతపురం. కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని... అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ విషయానికి వస్తే గురువారం ఉదయం నుండి వర్షాలు కురుస్తుండటం వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈ రెండ్రోజులు కూడా వాతావరణ పరిస్థితి ఇలాగే ఉంటుందని... వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో వర్షాలు కొనసాగుతాయని తెలిపారు. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.
ద్రోణి, రుతుపవనాల కదలికల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, ఆసిఫాబాద్, నిర్మల్, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో శక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.