Holidays : తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 24 నుండి ప్రారంభమైన ఈ సెలవులు జూన్ 11 వరకు కొనసాగనున్నాయి... జూన్ 12న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ తిరిగి ప్రారంభం అవుతాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంకా ముందుగానే సెలవులు ముగియనున్నాయి. కానీ కొన్ని విద్యాసంస్థలకు మాత్రం జూన్ 30 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి.
ట్రిపుల్ ఐటీలకు వేసవి సెలవులు :
ఆంధ్ర ప్రదేశ్ లోని ట్రిపుల్ ఐటీ (రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం) విద్యార్థులకు వేసవి సెలవులు మొదలయ్యాయి. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు మే 15 (గురువారం) నుండి వేసవి సెలవులు ఇచ్చారు. జూన్ 30 వరకు ఈ సెలవులు కొనసాగుతాయని ట్రిపుల్ ఐటీ అధికారులు ప్రకటించారు.
కేవలం విద్యార్థులకు కాదు ట్రిపుల్ ఐటీ సిబ్బందికి కూడా వేసవి సెలవులు ఇచ్చారు. మే 18 నుండి జూన్ 9 వరకు సిబ్బందికి వేసవి సెలవులు ప్రకటించారు. అంటే దాదాపు 20 రోజులపాటు ఆంధ్ర ప్రదేశ్ లోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లు పూర్తిగా మూతపడనున్నాయి.
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ :
ఆంధ్ర ప్రదేశ్ లోని ట్రిపుల్ ఐటీ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇప్పటికే 2025-26 అకడమిక్ ఇయర్ కు సంబంధించి ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మే 20 వరకు విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు.
దరఖాస్తులను పరిశీలించి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు... జూన్ 5న అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఇలా సెలెక్ట్ అయ్యే విద్యార్థులకు నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ క్యాంపస్ లలో ఏదో ఒకదాంట్లో చదివే అవకాశం వస్తుంది... ఆరేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సులు చేస్తారు. కేవలం పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తే చాలు ట్రిపుల్ ఐటీలో చదువకునే అవకాశం వస్తుంది.
పదో తరగతి పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.300, రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు రూ.200, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం నాలుగు క్యాంపస్ లలో 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జూన్ 30న వేసవి సెలవులు ముగిసి క్లాసులు ప్రారంభమవుతాయి... అప్పటివరకు అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది.