
Markapuram Bus Accident : కర్నూల్, చేవెళ్ల బస్సు ప్రమాదాలను మర్చిపోకముందే తాజాగా మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఇవాళ (మార్చి 26, గురువారం) ఆంధ్ర ప్రదేశ్ మార్కాపురం జిల్లాల్లో ట్రావెల్స్ బస్సు, కంకర లారీ ఢీకొన్నాయి. అయితే రెండు వాహనాలు ఢీకొనడం కంటే దీనివల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగడంతోనే ప్రమాద తీవ్రత పెరిగింది… బస్సులో ఉన్నవారు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మరణించగా మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
నిన్న (మార్చి 25, బుధవారం) రాత్రి తెలంగాణలోని జగిత్యాల జిల్లా నుండి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఆంధ్ర ప్రదేశ్ కు బయలుదేరింది. 30 మందికి పైగా ప్రయాణికులతో ఈ బస్సు వింజమూరు వెళుతోంది. రాత్రంతా ప్రయాణం సాఫీగానే సాగింది… గురువారం తెల్లవారుజామున 6-6.30 గంటలకు బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపానికి చేరుకుంది.
అయితే ఇదే సమయంలో చీమకుర్తి నుండి కంకర లోడ్ తో ఓ లారీ వేగంగా దూసుకువచ్చింది. ఓ మలుపు వద్ద ఈ ట్రావెల్స్ బస్సు, కంకర లారీ ఎదురెదురుగా వచ్చాయి... రెండు వాహనాలు మంచి వేగంతో ఉండటంతో అదుపుతప్పి ఒకటికొకటి ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సులో వ్యాపించాయి... క్షణాల్లో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. దీంతో బస్సులో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో బస్సు వెనకాల ఉన్న ప్రయాణికులే ఎక్కువగా మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందు సీట్లలో ఉన్నవారికి తప్పించుకునేందుకు అవకాశం దొరికింది... కానీ వెనకాల ఉన్నవారు తేరుకునేలోపే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటల్లో చిక్కుకుని కొందరు అక్కడిక్కడే మరణించగా మరికొందరు తీవ్ర గాయాలతో హాస్సిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఇలా ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
మార్కాపురం ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగడానికి ప్రమాదం కారణంకాదు... ప్రమాదం తర్వాత చెలరేగిన మంటలే కారణం. ఈ మంటలు మొదట టిప్పర్ లారీలో ప్రారంభమై బస్సుకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డీజిల్ ట్యాంక్ పేలిపోవడమే మంటలు చెలరేగడానికి కారణంగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. టిప్పర్ లో మొదలైన మంటలు బస్సుకు అంటుకున్నాయి... ఏసి గాలి, సీట్లతో పాటు మంటలు వేగంగా వ్యాపించే వస్తువులు ఎక్కువగా ఉండటంతో క్షణాల్లో బస్సు కాలిబూడిదయ్యింది. అందుకే చాలామంది ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేక సజీవదహనం అయ్యారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. అయితే అప్పటికే రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మార్కాపురం రోడ్డు ప్రమాద ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై వెంటనే అధికారులతో మాట్లాడిన ఆయన... గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించాలని సూచించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి జిల్లా అధికారులతో మాట్లాడారు... క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు... గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా అధికారులతో మంత్రి నారాయణ మాట్లాడారు. ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు ఉన్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆంధ్ర ప్రదేశ్ బస్సు ప్రమాదం కంటే ముందే మన పొరుగుదేశం బంగ్లాదేశ్ లో ఇలాంటి దారుణమే జరిగింది. ప్రయాణికులతో కూడిన బస్సు నదిలో మునిగి ఏకంగా 23 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. రంజాన్ సెలవులు ముగించుకుని రాజధాని ఢాకాకు 40 మంది బస్సులో బయలుదేరారు... వీరు ప్రయాణిస్తున్న బస్సును ఫెర్రీలో ఎక్కించి పద్మానదిని దాటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఫెర్రీలో ఎక్కిస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది... బస్సు అమాంతం నదిలో పడిపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు... కొందరు ఈ ప్రమాదంనుండి ప్రాణాలతో బైటపడ్డారు.
గతంలో కర్నూల్, చేవెళ్ల బస్సు ప్రమాదాలు.. ఇప్పుడు మార్కాపురం, బంగ్లాదేశ్ ప్రమాదాలు... ఈ దుర్ఘటనలు మరోసారి రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. డ్రైవర్ల నిర్లక్ష్యం, వేగ నియంత్రణ లోపం, వాహనాల సాంకేతిక లోపాలు వంటి అంశాలు ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.