
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఓ ద్రోణి కొనసాగుతోందని... దీనికి నైరుతి గాలులు తోడయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి... ఈ వారమంతా (మార్చి 15-22) ఇలాగే కురుస్తాయని హెచ్చరించింది. అంటే ఈవారం ఎండల తీవ్రత తక్కువగా ఉంటుందన్నమాట.
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని... ఇవాళ (మార్చి 16న) కూడా కొనసాగుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, చెదురుమదురు జల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న మూడురోజులు ఓవైపు ఎండలు, మరోవైపు ఆకాశం మేఘావృతమై కూల్ వెదర్... ఇలా విభిన్న వాతావరణం నెలకొంటుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని APSDMA ప్రకటించింది.
ఆకస్మిక వర్షాలతో పాటు పిడుగుపాట్లు, ఈదురుగాలుల ప్రమాదం పొంచివుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్ష సమయంలో చెట్ల క్రింద అస్సలు నిలబడరాదని హెచ్చరించింది. రైతులు ఈ అకాల వర్షాలతో పంట దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ సూచించింది.
తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి... ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ (మార్చి 16న) రాష్ట్రంలో ఎండల తీవ్రత తక్కువగా ఉంటుందని... సాధారణం కంటే 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయట. ఈ వారంరోజులు ఇదే వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇవాళ (మార్చి 16, సోమవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పిడుగులు కూడా ఈ వర్షాలకు తోడై ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయట. కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాజధాని నగరం హైదరాబాద్ ను కూడా వర్షాలు వదిలిపెట్టడంలేదు. నేడు శేరిలింగంపల్లి, పటాన్ చెరు, ఖైరతాబాద్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శివారుజిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలుల కారణంగా హోర్డింగ్, విద్యుత్ స్తంబాలు, చెట్ల కొమ్మలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో మార్చి 16-20 తేదీల మధ్యలో చాలా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు... ఉరుములు మెరుపులు, పిడుగులు.. బలమైన ఈదురుగాలులు... అక్కడక్కడ వడగళ్ల వానలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. మార్చి 18-19 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఈ క్రమంలో ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచించారు తెలంగాణ వెదర్ మ్యాన్.