బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Published : Nov 23, 2025, 09:26 PM IST

IMD Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడడంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

PREV
14
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది.. మళ్లీ భారీ వర్షాలు

బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులు మరోసారి తీవ్రంగా మారుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ రాబోయే గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ వ్యవస్థ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో మరింత బలంగా మారి తీవ్ర అల్పపీడనంగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అలాగే తదుపరి 48 గంటల్లో ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి శ్రీలంక, నైరుతి బంగాళాఖాత పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వాతావరణ మార్పులన్నీ కలసి ఆంధ్రప్రదేశ్‌పై భారీ వర్షాల ముప్పు పెంచుతున్నాయని అధికారులు తెలిపారు.

24
పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు

సోమవారం (నవంబర్ 24) నుంచి ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు లోతట్టు ప్రాంతాలను జలమయం చేశాయి.

తిరుపతి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, తిరుమల ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కడపలోని పలు గ్రామాల్లో భారీగా నీరు నిలిచింది. రక్షణ చర్యల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న రైతులు ముఖ్యంగా వరి కోత పనుల్లో అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

34
మరో తుపాను వస్తుందా? ఐఎండీ కీలక అంచనా

ఇప్పటికే మొంథా తుపాను దెబ్బకొట్టగా,  మరో కొత్త వ్యవస్థ రాష్ట్రానికి ముప్పుగా మారే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం 24వ తేదీన వాయుగుండంగా మారి, 30వ తేదీ నాటికి తీవ్ర తుపానుగా బలపడవచ్చని అంచనా వేసింది.

తుపాను పశ్చిమ–వాయువ్య దిశలో కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు చేరే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. నవంబర్ 28 నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం వంటి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

44
తీరప్రాంతాల్లో అల్లకల్లోలం

తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరం చేరాలని వాతావరణ శాఖ సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. సోమవారం రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు మూడు రోజులుగా పడిపోని ఉష్ణోగ్రతలు తుపాను ప్రభావం తగ్గిన తర్వాత క్షీణించే అవకాశముందని హైదరాబాదు వాతావరణ కేంద్రం పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories