ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలోనే రాష్ట్రంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. విశాఖపట్నం, విజయవాడలో ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మెట్రో ప్రాజెక్టులు తొలి దశలోకి ప్రవేశించాయి. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి అధికారిక ఆమోదం లభించింది.
విశాఖ, విజయవాడ మెట్రో రైలుల డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారీ బాధ్యతను సికింద్రాబాద్కు చెందిన బార్సిల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. టెండర్ ప్రక్రియలో అత్యంత తక్కువ ధరను పేర్కొన్న ఈ సంస్థను మెట్రోరైల్ కార్పొరేషన్ సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించి పురపాలక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
25
డబుల్ డెక్కర్ మెట్రో
ప్రత్యేక ఆకర్షణగా డబుల్ డెక్కర్ మెట్రో రైలు మార్గాలు ప్రతిపాదిస్తున్నారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం 19 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లు నిర్మించనున్నారు. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.70 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ మార్గాన్ని ప్రణాళికలో చేర్చారు.
విశాఖపట్నంలో మొదటి దశలో మూడు కారిడార్లు మొత్తం 46.23 కి.మీ. మేరగా నిర్మించేందుకు రూ.11,498 కోట్ల బడ్జెట్ అంచనా వేసింది. రెండో దశలో 30.67 కి.మీ పొడవున మరో కారిడార్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీని వ్యయం రూ.5,734 కోట్లు. విజయవాడలో గన్నవరం నుంచి నెహ్రూ బస్టాండ్ వరకు, అలాగే అమరావతి దాకా మార్గాలు రూపొందిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే DPR తయారీకి అవసరమైన నిధులను మంజూరు చేసింది. CMP (Comprehensive Mobility Plan) కింద విశాఖకు రూ.84.47 లక్షలు, విజయవాడకు రూ.81.68 లక్షలు విడుదలయ్యాయి. ఈ నిధులతో ప్రాజెక్ట్ రూపకల్పన, ప్రాథమిక పరిశీలనలు కొనసాగుతున్నాయి.
55
మారనున్న స్వరూపం
ప్రాజెక్టు పూర్తయితే ఈ రెండు నగరాల్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (UMTA) భూసేకరణ, నిర్మాణం, నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషించనుంది.