
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా వేగంగా మారిపోతున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం ప్రాంతాల్లో గాలి దిశ మారడంతో రెండు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా, సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉండబోతోందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ఎండ ఉష్ణోగ్రత పెరుగుతూనే, సడెన్గా చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ పై భాగంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం క్రమంగా పశ్చిమ వైపునకు పయనిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై దీని ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణంతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండనుంది. ఆకాశంలో బలమైన మేఘాలు వస్తూ పోతున్నప్పటికీ, పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయితే నైరుతీ రుతుపవనాల్లో కొంత తేమ ఉండటంతో అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడవచ్చు.
తీవ్ర అల్పపీడనంతో పాటు ఒక ఆవర్తనం తోడవ్వడం వల్ల సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయి. రుతుపవన ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు, మరో ద్రోణి అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్ వరకు విస్తరించాయి.
అరేబియా సముద్రంలో గంటకు 60 కి.మీ, బంగాళాఖాతంలో 40 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీ తీరంలో గంటకు 35 కి.మీ, తెలంగాణలో 30 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఏపీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, తెలంగాణలో 33 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో తేమ 60%, కోస్తా, రాయలసీమల్లో 42%, తెలంగాణలో 55% వరకు ఉండనుంది.
హైదరాబాద్ ఐఎండీ తెలిపిన ప్రకారం.. తెలంగాణలోని పలు జిల్లాల్లో గాలిలో తేమ పెరగడం వల్ల అక్కడక్కడ సాయంత్రం వేళల్లో చినుకులు పడవచ్చు. అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మధ్యాహ్నానికి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది.
నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో సాయంత్రానికి వర్షాలు కురుస్తాయి. రాజధాని హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడే ఛాన్స్ ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు, రేపు గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తూ అక్కడక్కడ తేలికపాటి వానలు పడే వీలుంది.
గ్లోబల్ స్థాయిలో వాతావరణాన్ని పరిశీలిస్తే, ఎల్ నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో వేడి విపరీతంగా పెరిగింది. అక్కడ ఏకంగా 4 తుపాన్లు, 3 అల్పపీడనాలు క్రియాశీలంగా ఉన్నాయి.
లోవెల్ తుపాను: అత్యంత భయంకరంగా గంటకు 220 కి.మీ వేగంతో సుడిగాలులతో విరుచుకుపడుతోంది.
మారీ తుపాను: గంటకు 155 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.
కరీనా తుపాను: గంటకు 150 కి.మీ వేగంతో సుడిగాలులు వీస్తున్నాయి.
క్రోవాన్హ్ తుపాను: చైనా సమీపంలో గంటకు 75 కి.మీ వేగంతో తిరుగుతోంది. ఎల్ నినో తీవ్రత పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని తుపాన్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భూమధ్యరేఖా ప్రాంతం, అంటార్కిటికా అంతటా మేఘాలతో పాటు విపరీతమైన వేడి ఆవరించి ఉంది. దీనివల్ల ఈ సెప్టెంబర్ నెలలో అనూహ్యంగా సడెన్ వర్షాలు కురిసినా, ఎండాకాలం నాటి వేడి, ఉక్కపోత తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ తీర ప్రాంతాల్లో ఈ అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. విస్తారమైన వర్షాలు పడకపోవడం వల్ల పంటలకు సాగునీటి కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రైతులు వర్షాలపైనే పూర్తిగా ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ నీటి పారుదల మార్గాలను సిద్ధం చేసుకోవడం చాలా మంచిదని వాతావరణ విశ్లేషకులు సూచిస్తున్నారు.