Rain Alert : ఐఎండీ అలర్ట్.. రానున్న 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సమే

Published : Mar 19, 2026, 08:36 PM IST

Rain Alert : ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

PREV
15
బయటకు రావొద్దు.. ఏపీలో మరో మూడు రోజులు వడగళ్ల వానలు, ఐఎండీ మాస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు (మార్చి 20 నుండి 22 వరకు) రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి, రైతులకు భరోసా కల్పించారు.

25
వాతావరణ పరిస్థితుల పై ఐఎండీ హెచ్చరికలు

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ తీరం, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు తమిళనాడు మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పలుచోట్ల వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

శనివారం (మార్చి 21) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

35
రైతులకు ప్రభుత్వం అండ.. పంట నష్టంపై సమీక్ష

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మార్చి 18న కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని ఆదేశించారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం.. 16 మండలాల్లోని 89 గ్రామాల్లో సుమారు 1,481 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ఇందులో వరి 384 హెక్టార్లు, మొక్కజొన్న 630 హెక్టార్లు, మినుము 200 హెక్టార్లు దెబ్బతిన్నాయి. దాదాపు 2,043 మంది రైతులు ఈ వర్షాల వల్ల నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు.

అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లో అరటి, బొప్పాయి, మామిడి, నారింజ వంటి ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందిస్తుందని ఎండీ ప్రఖర్ జైన్ పునరుద్ఘాటించారు.

45
మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో క్షేత్రస్థాయిలో చర్యలు

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. "రైతులు ఆందోళన చెందవద్దు, ప్రతి ఎకరా నష్టాన్ని రికార్డు చేస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు. మినుము, మిరప, పసుపు వంటి పంటలను ఆరబెట్టిన రైతులు, అవి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను త్వరగా కోసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.

సకాలంలో వాతావరణ సమాచారాన్ని రైతులకు చేరవేయడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని, ఇందుకోసం ఆర్టీజీఎస్, విపత్తు నిర్వహణ సంస్థ సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. గాలివానలు వీస్తున్న సమయంలో వ్యవసాయ పనిముట్లు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు.

55
ప్రజలకు, రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు

రానున్న మూడు రోజులు వాతావరణం ప్రతికూలంగా ఉండనున్నందున విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేసింది:

  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో గానీ, చెట్ల కింద గానీ ఉండకూడదు.
  • పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి.
  • పశువులను, గొర్రెలను బయట చెట్ల కింద కట్టేయకుండా సురక్షిత కట్టడాల కింద ఉంచాలి.
  • వర్షం వచ్చే ముందు రైతులు తమ ధాన్యం బస్తాలను టార్పాలిన్లతో కప్పి ఉంచాలి.
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ప్రభుత్వం ఎప్పటికప్పుడు రియల్ టైమ్ అప్‌డేట్స్‌ను అందిస్తుందని, ప్రజలు ఈ సమాచారాన్ని గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories