శ్రీకాళహస్తిలో భారీ చోరీ జరిగింది. పట్టపగలే రద్దీగా వుండే వీధిలో కేవలం ఒకే ఒక దుండగుడు ఈ చోరీకి పాల్పడ్డాడు.
శ్రీకాళహస్తి : కంట్లో కారం చల్లి బంగారు అభరణాలు దోచుకెళ్లాడో దుండగుడు. సినీపక్కీలో పట్టపగలే జరిగిన ఈ దోపిడీ శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో వున్న నగల దుకాణంలో...అదీ పట్టపగలు చోరీ జరగడం సంచలనంగా మారింది.
శ్రీకాళహస్తి పట్టణంలో నిత్యం రద్దీగా వుండే నగరివీధిలో ఈ చోరీ జరిగింది. ఆ వీదిలోని నవరత్న జ్యూవలరీ దుకాణంలోకి సాయంత్రం సమయంలో ఓ గుర్తు తెలియని దుండగుడు నగలు కొనేందుకని చెప్పి ప్రవేశించాడు. ఇదే విషయాన్ని చెప్పి దుకాణంలోని వ్యక్తితో మాటలు కలిపాడు.
ఈ క్రమంలోనే మెడలో వేసుకునే చైన్లు డిజైన్లు చూపించమని అడగ్గా దుకాణంలోని వ్యక్తి చూపించసాగాడు. ఆ సమయంలో చూపించిన కొన్ని చైన్లను చేతికి చుట్టుకుని ఇంకా చూపించమని అడిగాడు. ఆ మేరకు డిజైన్లు చూపించే సమయంలో ఒక్కసారిగా జేబులో నుంచి కారం పొడి తీసుకుని సేల్స్ మ్యాన్ కళ్ళల్లో చల్లాడు.
కేవలం తనవద్దనున్న చైన్లను మాత్రమే కాకుండా పక్కనే షోకేస్ లాకర్ లో వున్న మరో అభరణాన్ని కూడా తీసుకుని బయటకు వచ్చాడు. షాప్ బయట వుంచిన బైక్ పై అక్కడి పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులను విచారించారు. సీసీ టీవీ పూటేజ్ ను పరిశీలించి విచారణ చేపట్టారు. దీని ఆదారంగా దుండగుడు తిరుపతి మార్గం వైపు పరారైనట్లు గుర్తించారు. పట్టపగలే జరిగిన ఈ సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది.
చోరీ అయిన నగల విలువ దాదాపు మూడు లక్షలు వుంటుందని జ్యుయలరీ యజమాని తెలిపాడు. ఈ మేరకు అతడి నుండి పోలీసులు ఫిర్యాదును కూడా స్వీకరించారు.
వీడియో