భారతదేశంలో ఆన్‌లైన్ ద్వారా... బంగారం, ఆభరణాలపై రుణాలు...

By Sandra Ashok KumarFirst Published Jan 18, 2020, 11:43 AM IST
Highlights

భారతదేశంలో పసిడి రుణాల మార్కెట్‌ రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఇది 2022 నాటికి రూ.4,61,700 కోట్లకు పెరగొచ్చని అధ్యయన సంస్థ కేపీఎంజీ అంచనా వేసింది. ఎన్బీఎఫ్సీ, ఫిన్ టెక్ సంస్థలు ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులకు చేరువ కావడంతో బంగారం రుణాలు పెరిగాయని తెలుస్తోంది.

న్యూఢిల్లీ: బంగారం రుణాల మార్కెట్‌ శరవేగంగా మన దేశంలో వృద్ధి చెందుతోంది. వచ్చే రెండేళ్లలో భారతదేశంలో పసిడి రుణాల మార్కెట్ రూ.4,617 బిలియన్ల (రూ.4,61,700 కోట్లు)ను తాకవచ్చని కేపీఎంజీ రిపోర్టు అంచనా వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే సంస్థలు దేశవ్యాప్తంగా తమ శాఖలను పెద్ద ఎత్తున విస్తరించాయని, ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో మరీ ఎక్కువయ్యాయన్నది.  

also read వస్తువులపై 50 నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాల పెంపు....

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, కొత్తకొత్తగా వస్తున్న ఫిన్‌టెక్‌ సంస్థలు.. ఆన్‌లైన్‌, డిజిటల్‌ విధానాల్లో బంగారు రుణాలను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని, కస్టమర్ల వద్దకే వెళ్లి సేవలను అందిస్తున్నాయని వెల్లడించింది.దేశీయ గోల్డ్‌ లోన్‌ మార్కెట్‌లో దాదాపు 35 శాతం బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, నిధి కంపెనీలదేనని తెలియజేసింది.

ఈ క్రమంలోనే 13.4 శాతం వార్షిక వృద్ధి సాయంతో 2022 నాటికి రూ.4,617 బిలియన్లకు చేరే అవకాశాలున్నాయని ‘భారతీయ వ్యవస్థీకృత రుణ మార్కెట్‌లో గోల్డ్‌ ఫైనాన్షియర్స్‌ పునర్వైభవం’ నివేదికలో పేర్కొన్నది. గత ఐదేళ్లలో రుణాల వృద్ధి వార్షికంగా 13.4 శాతం మేర ఉన్నట్టు తెలిపింది. 

ఎన్‌బీఎఫ్‌సీలు, ఇంటి వద్దకే వచ్చి రుణాలను అందించే నూతన తరం ఫిన్‌టెక్‌ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడంతో డిజిటల్‌ వేదికగా కొత్త కస్టమర్లను చేరుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలతో కూడిన వ్యవస్థీకృత రంగం వాటా 35 శాతంగా ఉంది. 

also read రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల జోరు... చరిత్రలో ఇదే తొలిసారి

పసిడి రుణ మార్కెట్లో సంఘటిత రంగంతో పోలిస్తే అసంఘటిత రంగ మార్కెట్‌ రెండు రెట్లు అధికంగా ఉంది. దీంతో సంఘటిత రంగ విస్తరించడానికి అపార అవకాశాలు ఉన్నాయి. ఇంత కాలంగా బంగారం రుణాలకే పరిమితమైన పెద్ద కంపెనీలు తమ వృద్ధిని కాపాడుకునేందుకు సూక్ష్మ రుణాలు, ఎస్‌ఎంఈ రుణాలపైనా దృష్టి పెట్టాయి. 

అయితే, బంగారం రుణ మార్కెట్‌ ధరల పరంగా అస్థిరత, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నిధుల లభ్యత సమస్యలను ఎదుర్కొంటోంది. బంగారం రుణాలను ఇచ్చే కంపెనీలు లోన్‌ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణ నిష్పత్తి)ను తక్కువగా నిర్ణయించడం, తక్కువ కాల వ్యవధికే రుణాలను ఇవ్వడం ద్వారా ధరల అస్థిరతలను అధిగమిస్తున్నాయి.   

click me!