దాచేపల్లి అత్యాచార నిందితుడు సుబ్బయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
గుంటూరు: దాచేపల్లి అత్యాచార నిందితుడు సుబ్బయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన తర్వాత అతను చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
సుబ్బయ్య మృతదేహాన్ని తీసుకుని వెళ్లేందుకు అతని కుటుంబ సభ్యులు నిరాకరించారు. తండ్రి అంత్యక్రియలు చేయడానికి అతని కుమారుడు ఇష్టపడలేదు. సుబ్బయ్య మృతదేహాన్ని దాచేపల్లి పంచాయతీ సిబ్బందికి అప్పగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఆత్మహత్యకు కొన్ని గంటలకు ముందు సుబ్బయ్య తన బంధువుతో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ బయటికి వచ్చింది. ఎక్కడున్నావని బంధువు అడిగితే - చావుకు దగ్గరగా ఉన్నా అని సుబ్బయ్య చెప్పాడు. తనకు ఇక జీవితం లేదని, పది మందితో సరదాగా ఉండేవాడినని, అటువంటిది ఈ రోజు అనుకోకుండా జరిగిందని, ఇక బతకగూడదని, తన ముఖం చూపించలేనని సుబ్బయ్య బంధువుకు ఫోన్ లో చెప్పాడు.
సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని బాధితురాలి బంధువులు నిరసనకు దిగారు. మంత్రులు చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఎవరినీ ఉపక్షేంచబోమని దాచేపల్లి ఘటనతో రుజువైందని ప్రభుత్వం అంటోంది. ఇతర రాష్ట్రాలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అని వ్యాఖ్యానించింది. దాచేపల్లి ఘటనను అడ్డం పెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే సహించబోమని అన్నారు.
బాధితురాలికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించింది. శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాస రావు వ్యక్తిగతంగా బాధితురాలికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు.