తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

India Pakistan War : పాక్ తో పోరాటంలో వీరమరణం పొందిన తెలుగు జవాన్

Arun Kumar P | Updated : May 09 2025, 01:34 PM IST

పాకిస్థాన్ సేనలతో వీరోచితంగా పోరాడుతూ దేశం కోసం కోసం చివరకు తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు తెలుగు జవాన్ మురళీ నాయక్. జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్న అతడు యుద్దభూమిలో వీరమరణం పొందాడు. 

India Pakistan War : భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రమూకలను ఏరివేసేందుకు భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్, పాకిస్థాన్ మధ్య మిస్సైల్స్, డ్రోన్ దాడులు మొదలయ్యాయి. అలాగే భారత్, పాక్ బార్డర్ లో ఇరుదేశాల సైనికులు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు. 

ఆంధ్ర ప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని మారుమూల కల్లితండాకు చెందిన మురళీ నాయక్ భారత ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఎంతో కష్టపడి ఆర్మీలో చేరిన అతడు దేశ రక్షణ విషయంలో ఎప్పుడూ ముందుండేవాడు. అతడి ధైర్యసాహసాలకు మెచ్చిన ఆర్మి ఉన్నతాధికారులు కీలకమైన జమ్మూ కాశ్మీర్ లో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తూ పాక్ మూకలను ధైర్యంగా ఎదిరించే క్రమంలో మురళీ నాయక్ బుల్లెట్ గాయాలకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడు యుద్దభూమిలో వీరమరణం పొందాడు. 

ఇప్పటికే మురళీ నాయక్ మరణంపై కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దేశ రక్షణలో తమ బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. శనివారం (మే 10) మురళీ పార్థీవదేహం స్వస్థలం కల్లితండాకు చేరుకుంటుంది. ఇతడి అంత్యక్రియల్లో రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా భారీగా పాల్గొనే అవకాశం ఉంది. 

యువజవాన్ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం :

జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ తో పోరాడుతూ మరణించిన తెలుగుబిడ్డ మురళీ నాయక్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ''దేశ రక్షణలో  శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అంటూ ఎక్స్ వేదికన సంతాపం తెలిపారు. 

ఇక మంత్రి నారా లోకేష్ కూడా ఆర్మీ జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై స్పందించారు.  ''ఆపరేషన్ సిందూర్ లో భాగంగా  జమ్మూ కశ్మీర్  యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన  మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం'' అని లోకేష్ తెలిపారు. 

 తెలుగు జవాన్‌ మురళీ నాయక్‌ వీరమరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్మోహన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీనాయక్‌ కుటుంబానికి సంతాపం ప్రకటించి, బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్‌ త్యాగాన్ని మరువలేమన్నారు వైఎస్ జగన్.
 
 

Read more Articles on
click me!