Korean LG team follows indian tradition: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో రూ. 5000 కోట్లకు పైగా పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేస్తున్న మేన్యుఫాక్చరింగ్ ప్లాంట్కు గురువారం భూమి పూజ కార్యక్రమం జరగింది. ఈ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూమి పూజ సందర్భంలో మంత్రివర్యులు హిందూ సంప్రదాయాలను గుర్తు చేస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న కొరియన్ ప్రతినిధులను షూలు తొలగించుకుని భక్తిశ్రద్ధలతో పూజ చేయాలని సూచించారు.
నారా లోకేష్ సూచన మేరకు ఎల్జీ ప్రతినిధులు అందరూ తక్షణమే షూలు తొలగించి, సంప్రదాయబద్ధంగా భూమి పూజలో పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి, భక్తితో నేలపై కూర్చుని కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. దీనివల్ల భారత సంప్రదాయాల పట్ల గౌరవం, ఆచరణలో దానిని పాటించడంలో కొరియన్ ప్రతినిధుల నిబద్ధత స్పష్టమైంది.
ఈ కొత్త ప్లాంట్ ద్వారా ప్రారంభ దశలోనే కనీసం 2000 ఉద్యోగాలు కల్పించనుందని ఎల్జీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నారా లోకేష్ మాట్లాడుతూ.. "ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో పనిచేసిన తర్వాత దేశవ్యాప్తంగా అవసరమైన ఏసీలలో 70 శాతం ఏపీ నుంచి సరఫరా అవుతాయి" అని పేర్కొన్నారు.
ఈ పెట్టుబడితో రాష్ట్రానికి వచ్చిన ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాదు, ఉద్యోగావకాశాల పరంగా కూడా ఇది ఎంతో లాభదాయకమవుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఐదేళ్లలో లక్షలాది ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ఎల్జీ వంటి అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించడంలో ముందుంది.