వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీకి పేయిడ్ కన్సల్టెంట్స్అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీకి పేయిడ్ కన్సల్టెంట్స్అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. కడపలో స్టీల్ప్లాంట్ ఏర్పాటు కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణదీక్ష చేస్తుంటే జగన్, పవన్కళ్యాణ్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అడిగారు.
కుట్ర రాజకీయాలు చేయడానికే వారికి సమయం సరిపోతుందని, ప్రజా సమస్యలు పట్టించుకోడానికి వారికి సమయం ఎక్కడ ఉందని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్షా డైరెక్షన్లో జగన్, పవన్ నటిస్తున్నారని అన్నారు.
జగన్ తన పాదయాత్రలో రాష్ట్రం గురించి ఏనాడు మాట్లాడలేదని, సీఎం చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మరో టీడీపి ఎంపీ మాగంటి బాబు విమర్శించారు. జగన్కు సీఎం కుర్చీపై ఆరాటమే గానీ ఇంక దేనిపై లేదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పోరాడుతున్నారని, రాష్ట్రానికి కంపెనీలు రాకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు.