
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల అంశం .. జగన్ సర్కార్, టాలీవుడ్ కు మధ్య వివాదం సృష్టించింది. ఇరు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే.. భగ్గుమనేలా ఉంది. సినిమా టికెట్ల రేట్ల విషయంలో హీరోలు నాని, సిద్ధార్థ్ లు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాత, ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల పలువురు ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమను బాధిస్తున్నాయని అన్నారు.
ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎన్వీ ప్రసాద్ కోరాడు. థియేటర్ల సమస్యలపై ప్రభుత్వం నెలరోజులు సమయం ఇవ్వడం సంతోషంగానే ఉన్నా… థియేటర్ల సీజ్ అంశంపై.. పని ఒత్తిడిలో ఉన్న జాయింట్ కలెక్టర్లను కలిసి విన్నవించుకుంటే.. ఏం ప్రయోజనముంటుందని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో నెలకొన్న కొన్ని సమస్యల పట్ల హీరోలు స్పందించడం వల్ల సమస్య వచ్చిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారయిందని విమర్శించారు. ఆ గ్రామీణ ప్రాంత థియేటర్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
కరోనాతో రెండేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఓటీటీ కారణంగా సినీపరిశ్రమ నష్టాలకు మరో కారణం అన్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సమస్య మీద కాలయాపన చేయకుండా తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎవరు పడితే వారు సినీపరిశ్రమ గురించి మాట్లాడవద్దన్నారన్న ఆయన... మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు సినీపరిశ్రమను బాధ పెట్టే విధంగా ఉన్నాయన్నారు. కరోనా సమయంలో మూడు నెలల విద్యుత్ ఛార్జీలు మాఫీ అన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ పట్టించుకోలేదన్నారు. మరో వైపు నట్టి కుమార్ కు కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వానికి హీరో నాని క్షమాపణ చెప్పాలన్న నిర్మాత నట్టి కుమార్పై ఎన్వీ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే నట్టికుమార్ను తెలంగాణలో ప్రత్యేక ఛాంబర్ పెట్టుకోవాలని ఎన్.వి. ప్రసాద్ మండిపడ్డారు.
Read Also: మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భేటీ...
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లపై అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిబంధనలు పాటించని, తినుబండారాల కౌంటర్లలో అధిక ధరలకు విక్రయిస్తున్న థియేటర్లపై కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. సినిమా ప్రదర్శనలో నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున థియేటర్లను సీజ్ చేశారు. అయితే.. ఏపీలో సినిమా థియేటర్ల ఓనర్లకు కాస్త ఊరట కల్పించింది. ఈ నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం తీసుకుంది. మొత్తం రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్ చేసిన 83 థియేటర్లను ఓపెన్ చేసేందుకు అవకాశం కల్పించింది.
Read Also: తెలంగాణలో సినిమా టికెట్లకు రెక్కలు... ధరల పెంపుకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఇందుకోసం ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు థియేటర్ల ఓనర్లు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాడుల్లో గుర్తించిన లోపాలను ఓనర్లు కచ్చితంగా సరిదిద్దుకోవాలని ప్రభుత్వం సూచించారు. సీజ్ చేసిన థియేటర్లకు అన్ని వసతులు కల్పించిన తర్వాత నెల రోజుల్లో జేసీకి దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తారని వివరించింది.