
వంగవీటి రాధాపై (vangaveeti radha krishna) రెక్కీ జరిగి పదిరోజులౌతున్నా చర్యలు శూన్యమన్నారు టీడీపీ (tdp) పొలిట్ బ్యూరో సభ్యులు , మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు (kimidi kala venkata rao) . గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వంగవీటి రాధా వైసీపీని (ysrcp) వీడినందుకు ఆయనపై ఆ పార్టీ నాయకులు కక్షకట్టి రెక్కి నిర్వహించారని ఆరోపించారు. ఆయనపై ఎనలేని అభిమానాన్ని చూపిస్తూ నాటకమాడుతున్నారని వెంకట్రావు ఎద్దేవా చేశారు. రెక్కీ జరిగి పది రోజులైనా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు.
రెక్కీ నిర్వహించిన వ్యక్తులు విజయవాడలోనే యథేచ్చగా తిరుగుతున్నారని.. ఈ విషయాన్ని వైసీపీకి చెందినవారే చెబుతున్నారని కళా వెంకట్రావు అన్నారు. ఎందుకు వారిని పట్టుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో ఉండటం చూసి జగన్ అనుయాయులు తట్టుకోలేకపోతున్నారని... అందుకే వైసీపీలో ఉన్న వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తే చర్యలు తీసుకోకుండా కట్టుకథలు చెబుతున్నారని వెంకట్రావు ధ్వజమెత్తారు. కొన్ని సామాజిక వర్గాలను రెచ్చగొట్టటానికే ఈ తతంగమంతా అంటూ మండిపడ్డారు.
ALso read:Vangaveeti Radha ఆఫీస్ వద్ద స్కూటీ కలకలం.. అనుమానస్పదంగా ఉండటంతో..
సౌమ్యుడైన వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించడం చాలా బాధాకరమని.. వంగవీటి రంగా హత్య తప్పులేదన్నవారు ప్రస్తుతం వైసీపీలో కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నారన్న కళా వెంకట్రావు గుర్తుచేశారు. కాపు కార్పొరేషన్ను మూసివేసి పరిపాలన చేతకాదని నిరూపించారని... వివిధ రకాలుగా రాష్ట్రానికి తెచ్చిన రూ.6 లక్షల కోట్ల అప్పు ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో టీడీపీ హయాంలో కాపు సామాజికవర్గ పిల్లలకు 10 లక్షల మందిని విదేశాలకు పంపామని కళా వెంకట్రావు గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంతమందిని విదేశాలకు విద్యనభ్యసించడానికి పంపారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్ కింద వెళ్లిన వారి ఖాతాలను కూడా వైసీపీ ప్రభుత్వ ఖాతాలో వేసుకున్నారంటూ ధ్వజమెత్తారు. వంగవీటి రంగాను హత్య చేయటం మంచిదే అని చెప్పిన వ్యక్తులతో వైసీపీ నాయకులు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారంటూ కళా వెంకట్రావు మండిపడ్డారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కక్షలు, ముఠా తగాదాలు, కుల రాజకీయాలను పెంచి పోషిస్తున్న వైసీపీ ఇకనైనా వీటికి స్వస్తి పలకాలని ఆయన హితవు పలికారు.