టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో బాలకృష్ణ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ అవార్డు ను ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందించారు.

 

నందమూరి నట సింహం, టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ ను తనకు ప్రకటించడం పట్ల ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. బాలకృష్ణ వెల్లడించిన లేఖ ప్రకారం ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తయిన ఘడియలు ఒకవైపు, ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 సంవత్సరాలు పూర్తయి అమృతోత్సవాలు జరుగుతున్న వేళ, మరో వైపు బాలకృష్ణ తన నటనా ప్రయాణంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు కూడా జరుపుకున్నారు.

ఈక్రమంలో రీసెంట్ గా బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించిన నేపథ్యంలో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ జాతీయ అవార్డు రావడం తనకు గర్వకారణమని, ఇది తన తండ్రిగారు నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం ఫలమని బాలయ్య అన్నారు.

ఈ అవార్డు కోసం తనను ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జ్యూరీ సభ్యులకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ,ప్రపంచమంతటా ఉన్న తెలుగు ప్రజల ఆశీస్సులు, నాన్నగారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి బాలకృష్ణ చేసిన సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నందమూరి అభిమానులను ఎంతో సంతోషపెట్టింది. .

ఎన్టీఆర్ జాతీయ అవార్డు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గొప్ప సేవలందించిన వ్యక్తులకు అందించే గౌరవం. ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని చాలా మంది సినీ కళాకారులు అందుకున్నారు. తాజాగా ఈ ఈ జాబితాలో బాలకృష్ణ చేరారు.