కాబోయే వియ్యంకుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అక్కినేని నాగార్జున దంపతులు. అఖిల్ పెళ్లికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. గతేడాది నవంబర్ 26న ప్రముఖ బిజినెస్మెన్ జుల్ఫీ రవ్డ్జీ కుమార్తె జైనబ్తో అఖిల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అఖిల్-జైనబ్ వివాహం జూన్ 6న జరగనుంది. ఈ నేపథ్యంలో, నాగార్జున తన భార్య అమలతో కలిసి ఈరోజు( మే 31) ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం అధికార నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు.
నాగార్జున దంపతులతో పాటు, జైనబ్ కుటుంబ సభ్యులు కూడా ఈ సందర్భంగా సీఎం నివాసానికి వెళ్లారు. వివాహ ఆహ్వానం అనంతరం రేవంత్ రెడ్డితో వారు కాసేపు ముచ్చటించారు. ముఖ్యమంత్రిని తమ కుమారుడి వివాహానికి తప్పకుండా హాజరవ్వాలని మరీ మరీ అడిగినట్టు తెలుస్తోంది.
అఖిల్-జైనబ్ వివాహం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు, అత్యంత సమీప మిత్రుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. పెళ్లి తరువాత రాజస్థాన్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని అక్కినేని కుటుంబం ఆచనలో ఉన్నట్లు సమాచారం.
గత ఏడాది నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల వివాహం జరగగా, ఇప్పుడు అఖిల్ పెళ్లి జరగబోతోంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.