PBKS vs MI IPL 2025 Qualifier 2: ఐపీఎల్ 2025లో ఆర్సీబీతో ఫైనల్ కోసం పంజాబ్, ముంబయి జట్ల మధ్య జూన్ 1న క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఏ జట్టు గెలుస్తుందనే ఉత్కంఠ నెలకొంది. మరి ఫైనల్ కు వెళ్లే జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

PBKS vs MI IPL 2025 Qualifier 2: ఐపీఎల్ 2025 సీజన్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఆదివారం (జూన్ 1) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరుగనుంది. ఈ పోరులో గెలిచే జట్టు జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

పంజాబ్ కింగ్స్ కు మళ్లీ ఫైనల్ ఛాన్స్

పంజాబ్ కింగ్స్ జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. మొహాలీలోని PCA స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయి ఫైనల్ టికెట్‌ను కోల్పోయింది. రజత్ పాటిదార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్, అత్యుత్సాహంతో ఆడుతూ క్రమంగా వికెట్లు కోల్పోయి 14.1 ఓవర్లలో కేవలం 101 పరుగులకే ఆలౌట్ అయింది.

ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్ వంటి కీలక ఆటగాళ్లు ప్రారంభంలోనే ఔట్ కావడం పంజాబ్‌ను దెబ్బతీసింది. ఈ ఓటమి నేపథ్యంలో పంజాబ్ తన వ్యూహాన్ని పునః పరిశీలించే అవకాశం ఉంది. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆడే సూత్రాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని కూడా క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.

ముంబయి ఇండియన్స్ సూపర్ షో

ముంబయి ఇండియన్స్ జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్ 2కు అడుగుపెట్టింది. ముంబై తొలుత బ్యాటింగ్ చేసి 228/5 స్కోర్ చేసింది. అలాగే, బౌలింగ్ లో కూడా మంచి ప్రదర్శనతో విజయం సాధించింది.

బుమ్రా మరోసారి అద్భుతమైన బౌలింగ్ తో వేసి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 1 వికెట్ తీశారు. ట్రెంట్ బోల్ట్ రెండు వికెట్లు తీసినా 54 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా, రిచర్డ్ లాంటి ఆటగాళ్లు మాత్రం 30కి పైగా పరుగులు ఇచ్చారు. క్వాలిఫయర్ 2కు దీపక్ చాహర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది.

PBKS vs MI: బ్యాటింగ్, బౌలింగ్ పరంగా రెండు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

పంజాబ్‌కు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల నుంచి మంచి ప్రారంభం అవసరం. వారు భాగస్వామ్యాలను నిర్మించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టగలిగితే విజయం సాధించగలుగుతారు.

ముంబయి జట్టు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఫామ్‌లో ఉన్నారు. వీరంతా ధనాధన్ బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్లు.

PBKS vs MI: వాతావరణం, పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే?

నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. నైట్ మ్యాచ్‌లలో లైట్‌ల క్రింద పేసర్లకు సహాయం లభించే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ చేసే యత్నం చేస్తుంది. ఆ తర్వాత పిచ్ మంచు కారణంగా నెమ్మదించే అవకాశముంటుంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌ పై ప్రభావం పడుతుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరుతుంది. ఒత్తిడిని ఎదుర్కొని వ్యూహాలను సమర్థంగా అమలు చేయగల జట్టే విజేతగా నిలవనుంది. ప్రస్తుతం ఇరు జట్ల ఫామ్, ప్లేయర్లు, వ్యూహాల అమలు తీరును గమనిస్తే ముంబై ఇండియన్స్ కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచిన పంజాబ్ కింగ్స్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. పంజాబ్ జట్టులోని టాపార్డర్ లో ఒక్కప్లేయర్ చివరివరకు క్రీజులో నిలిస్తే మ్యాచ్ స్వరూపం మారిపోతుంది.