అర్ధరాత్రి నుంచి క్యాబ్ లు కట్
- బంద్ కు పిలుపునిచ్చిన క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్
క్యాబ్ కంపెనీలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అర్ధరాత్రి నుంచి జనవరి 4 వరకు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ ప్రకటించింది.
ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లతో పాటు ప్రతి క్యాబ్ డ్రైవర్ సమ్మె లో పాల్గొంటారని క్యాబ్ డ్రైవర్ల ప్రెసిడెంట్ శివ ప్రకటించారు.
ముఖ్యంగా ఉబర్ కంపెనీ టూ వీలర్ రైడ్ ను తీసుకురావడం వల్ల తమకు తీవ్రనష్టం జరుగుతుందని దీన్ని వెంటనే విరమించాలని డిమాండ్ చేశారు. దీని పై రవాణా శాఖ మంత్రి దృష్టి కి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఉబర్ టూ వీలర్ లను సీఎం క్యాంపు ఆఫీస్ లోనే ప్రారంభించడం దారుణమన్నారు. తమ పొట్టకొట్టే ఇలాంటి చర్యలను ప్రభుత్వం ప్రోత్సహించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
రోజు కు 18 గంటలు పనిచేయడం వల్ల క్యాబ్ డ్రైవర్లకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. డ్రైవర్ల సమస్యలను యాజమాన్య దృష్టికి తీసికెళ్లిన సరిగా పట్టించుకోకుండా దాడులకు దిగుతున్నారనితెలిపారు.
న్యూ జాయినింగ్ అనే విధానాన్ని రద్దు చేయాలని, షేర్ బుకింగ్ విధానం కూడా తొలగించాలని డిమాండ్ చేస్తూ బంద్ ను తలపెట్టినట్లు ప్రకటించారు.