Operation Sindoor: పాకిస్థాన్ కు భారత్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ కాల్పులు జరిపితే పాక్ వుండదనే తరహాలో భారత నౌకా దళం హెచ్చరించింది.
Operation Sindoor: ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించడంతో భారత్ "ఆపరేషన్ సింధూర్" పేరుతో ఉగ్రవాదులపై దాడులు చేసింది. ఈ చర్యలో భారత సైన్యం, వాయుసేనతో పాటు నౌకా దళం కూడ అత్యున్నత స్థాయి సిద్ధతతో పాల్గొంటోంది. ఉగ్రదాడికి పాల్పడినవారు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఉన్నారని భారత రక్షణ శాఖ గుర్తించింది.
ఈ నేపథ్యంలో, భారత నౌకాదళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ (DGNO) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, "ఈసారి పాకిస్థాన్ ఏదైనా చర్య తీసుకోవాలనుకుంటే, వారికి మేము ఏమి చేయబోతున్నామో తెలుసు," అని స్పష్టంగా హెచ్చరించారు.
ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన వెంటనే, నౌకాదళం తమ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్, ఉపరితల దళాలు, జలాంతర్గాములు, వాయు ఆధారిత నౌకా వనరులను సముద్రంలో పూర్తి సిద్ధతతో మోహరించింది. అరేబియా సముద్రంలో ఆయుధాల పరీక్షలు నిర్వహించడం ద్వారా టార్గెట్లపై స్పష్టమైన దాడుల సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు.
"మా సిబ్బంది, ఆయుధాలు, పరికరాలు, నౌకల సామర్థ్యం ద్వారా ఎంచుకున్న లక్ష్యాలను సమర్థవంతంగా చేదించే స్థాయిలో సిద్ధంగా ఉన్నాం" అని వైస్ అడ్మిరల్ అన్నారు.
ఆపరేషన్ సమయంలో నౌకాదళం ఉత్తర అరేబియా సముద్రంలో ముందుగా మోహరించగా, పాకిస్థాన్ నౌకాదళం తమ హార్బర్లలోనే లేదా తీరానికి సమీపంలోనే ఉండే విధంగా రక్షణాత్మక ధోరణి తీసుకుంది. ఇది భారత నౌకాదళం మానవనిర్మిత డొమైన్లో ఉన్న ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపింది.
ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్త చర్యల కారణంగా పాకిస్థాన్ వెంటనే కాల్పుల విరమణ కోసం అభ్యర్థించిందని DGNO పేర్కొన్నారు.
"పాకిస్థాన్ లేదా పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదుల నుంచి వచ్చే ఏదైనా శత్రుత్వ చర్యకు భారత నౌకాదళం తగిన విధంగా తక్షణమే ప్రతిస్పందించేందుకు సముద్రంలో గట్టిగానే మోహరించి ఉంది" అని చివరగా హెచ్చరించారు.