Heavy rains: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. ఈ క్ర‌మంలోనే మహారాష్ట్రలోని ప‌లు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించింది. అలాగే, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఆకస్మిక వరదలు, న‌దులు ఉప్పొంగే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఇప్ప‌టికే ఆయా ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డుతున్నాయి. 

Heavy rain likely in several states: దేశంలోని చాలా ప్రాంతాల్లో వాన‌లు దంచి కొడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) ప‌లు ప్రాంతాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. రానున్న రెండు రోజుల్లో గోవా, మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతం, కోస్తా కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ బుధవారం తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ జారీ చేసిన 'రెడ్ అలర్ట్' నేపథ్యంలో రాయ్ గ‌ఢ్ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు అధికారులు గురువారం వరకు సెలవు ప్రకటించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న బియాస్ నది కారణంగా వాయవ్య భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ లో 652 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, 6,686 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 236 దుకాణాలు, 2,037 గోశాలలు దెబ్బతిన్నాయని రాష్ట్ర ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ డేటాను ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది. జులై 26-27 తేదీలలో హిమాచల్ ప్రదేశ్‌లోని 12 జిల్లాల్లోని ఎనిమిది జిల్లాల్లోని వివిక్త ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కార్యాలయం 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, బురదజల్లులు, నదులలో ప్రవాహాలు పెర‌గ‌డం వంటి హెచ్చ‌రికులు చేసింది. ముంబ‌యి మెట్రోపాలిటన్ ప్రాంతానికి 'ఆరెంజ్' అలర్ట్, రత్నగిరి, రాయ్ గ‌ఢ్ ల‌కు 'రెడ్' అలర్ట్ ను ముంబ‌యి ప్రాంతీయ వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

మహారాష్ట్రలోని రాయ్ గ‌ఢ్ జిల్లాలో బుధవారం ఉదయం 10 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో సగటున 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులను ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం కలెక్టర్‌ డాక్టర్‌ యోగేష్‌ మహసే సెలవు ప్రకటించారు. మరోవైపు ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో ఇది నెమ్మదిగా వాయువ్య దిశగా కదులుతుందని పేర్కొంది.