న్యూఢిల్లీ: 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మృతి దేశంలో పని ఒత్తిడి చర్చకు దారితీసింది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న ఆమె మృతికి కారణం పని ఒత్తిడేనని తల్లి ఆరోపించారు. ఈ కేసుని దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మహారాష్ట్రలోని పూణేకు చెందిన అన్నా సెబాస్టియన్ 2023 లో చార్టర్డ్ అకౌంటెంట్ పూర్తి చేసింది. ఎంతో కష్టపడి చదివి అనుకున్నది సాధించిన ఆమె ఎన్నో ఆశలతో ఆరు నెలల క్రితమే అంటే మార్చి,2024 లో ఈవై అనే కంపనీలో ఉద్యోగంలో చేరింది. అయితే ఇక్కడ పని  ఒత్తిడి ఎక్కువగా వుండటంతో ఆమె శారీరకంగానే కాకుండా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయినట్లు తల్లి చెబుతున్నారు.

తన కూతురు ప్రతిరోజూ బాగా అలసిపోయి ఇంటికి వచ్చేది... ఒక్కోసారి ఇంటికి రాగానే మంచంపై కూలబడిపోయేదని సెబాస్టియన్ తల్లి ఆవేదనతో తెలిపింది. పని  ఒత్తిడితో బాధపడుతున్న ఆమెను ఉద్యోగం మానేయాలని చెప్పినా వినలేదన్నారు. తన తోటి ఉద్యోగులు ఆ పని చేసినా సెబాస్టియన్ మాత్రం ఉద్యోగాన్ని కొనసాగించిందని తల్లి తెలిపారు. కానీ చివరకు ఆ పని ఒత్తిడి కారణంగానే కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆ తల్లి కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

మితిమీరిన పని ఒత్తిడికి గురయిన కూతురు ఇటీవల ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిందని సెబాస్టియన్ తల్లి తెలిపారు. అయితే ఆమె అంత్యక్రియలకు కంపెనీకి చెందిన ఏఒక్క అధికారి రాలేడని మరింత విషాదానికి వ్యక్తం చేసారు. అయితే యువ సీఏ సెబాస్టియన్ మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

 

మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సెబాస్టియన్ మృతిపై ఎక్స్ వేదికన స్పందించారు. యువతి మృతి చాలా బాధాకరం... ఇది తననెంతో కలచివేసిందని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరపాలని కేంద్ర మంత్రులు మన్సుక్ మాంఢవీయ, శోభా కరంద్లాజే లను రాజీవ్ చంద్రశేఖర్ కోరారు. 

దీంతో కేంద్రమంత్రి శోభా కరందాజ్లే యువతి అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మృతిపై విచారణ జరిపించనున్నట్లు ప్రకటించారు. యువతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.