ఈ రోజు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి 
 (24-7-1890 7-3-1979)

 గ్రంథాలయోద్యమ పితామహుడుగా,జీవితాంతం గ్రంథాలయాల అభివృద్ధి కోసం,అద్వితీయంగా,అనన్యంగా,అహర్నిశలూ,బహుముఖ సేవలందించిన
అయ్యంకి వెంకటరమణయ్య 1890 జులై 24న, తూర్పుగోదావరి జిల్లాలోని ,రామచంద్రపురం తాలూకా,కొంకుదురు గ్రామంలో శ్రీమతి వెంగమాంబ
వెంకటరత్నం దంపతులకు జన్మించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

1907లోప్రముఖజాతీయనాయకుడు,స్వాతంత్య్ర సమర యోధుడు బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి లో భారతస్వాతంత్య్ర సమరంలో యువకులు పాల్గొనాలని ఇచ్చిన ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలు విని, చదువుకు స్వస్తి చెప్పి దేశ సేవకు జీవితాన్ని అంకితం చెయ్యటానికి 'రక్షాబంధనం ' కట్టుకొన్నారు.

దేశంలోని పలు సమస్యలకు ముఖ్యకారణం అవిద్య, అజ్ఞానం అని గ్రహించి, అందరినీ విద్యావంతులుగా,
జ్ఞాన వంతులుగా చెయ్యాలని అందుకు గ్రంథాలయాల వ్యాప్తి అవసరమని భావించి ఆ ఉద్యమ వ్యాప్తికి కంకణం
కట్టుకొన్నారు. 1910 లో బందరులో 'ఆంధ్రభారతి' సచిత్ర మాసపత్రిక ప్రారంభించారు. అలాగే 'గ్రంథాలయసర్వస్వం'(త్రైమాసిక),
'ఇండియన్ లైబ్రరీ జర్నల్', 'కొరడా', 'ప్రకృతి', 'ది ఇండియన్ నేచురోపతి','సహకారం', 'దివ్యజ్ఞాన దీపిక' వంటి
పత్రికలను కూడా నడిపారు.

ఆంధ్రభాషాభివర్థినీ మండలి, ఆంధ్రపరిషత్తు,కళాపీఠము, దివ్యజ్ఞాన చంద్రికామండలి అనే గ్రంథమాలలను
స్థాపించి అనేక ఉత్తమ రచనలను తెలుగు పాఠకులకు అందించారు. గ్రంథాలయోద్యమంలో వీరి సేవలను
గుర్తించి, వారి సప్తతి మహోత్సవ సందర్భంగా ,గుడివాడలో 'సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్ఠాపనాచార్య' బిరుదుతో
సత్కరించారు.1977లో ప్రొఫెసర్ కౌలా అంతర్జాతీయ స్వర్ణపతకం అందుకున్నారు. భారత ప్రభుత్వం వీరి గ్రంథాలయ సేవలకు స్పందించి 1972 లో
'పద్మశ్రీ' తో గౌరవించింది.

ఆంధ్రదేశంలో గ్రంథాలయోద్యమ పితామహుడుగా,గ్రంథాలయ వైతాళికుడుగా, 'గ్రంథాలయ శాస్త్ర విశా‌ద'గా ,వెలుగొందిన అయ్యంకి వెంకటరమణయ్య 1979 మార్చి 7 న
విజయవాడలో అస్తమించారు

(*వైద్యం వేంకటేశాచార్, స్కాలర్, టిటిడి భాగవత ప్రాజక్టు. సౌజన్యం:కురాడి చంద్రశేఖర కల్కూర )