Budget 2020: నిర్మలా సీతారామన్ బడ్జెట్.... పలు కీలక ప్రకటనలు...
ప్రతి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తున్నప్పుడు ప్రభుత్వాలు పలు ప్రకటనలు చేస్తుంటాయి. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పలు కీలక ప్రకటనలు చేశారు. మరి వాటిలో ఆచరణకు నోచుకున్నవెన్నీ, ప్రతిపాదనలకు పరిమితమైనవెన్నీ అన్న సంగతి పరిశీలిద్దాం..
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు బడ్జెట్లలో ఎన్నో ప్రకటనలు చేస్తుంటాయి. కానీ, వాస్తవంగా వీటిల్లో కొన్నే అమలవుతాయి. ప్రతి ప్రభుత్వంలో సర్వసాధారణం. మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు.
వీటిల్లో కొన్ని అమలుకు నోచుకోగా మరికొన్ని అసలే అమలు కాలేదు. ఇంకొన్ని లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, పన్ను వసూళ్లు తగ్గడం వంటి అనుకోని అవాంతరాలు ఎదురుకావడంతో ప్రభుత్వం వీటి అమల్లో దూకుడుగా ముందుకు పోలేకపోయింది.
ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (పీఎంఏవై) రెండోదశ కింద 2019-20 నుంచి 2021-22 నాటికి 1.95కోట్ల ఇళ్లను అర్హుల కోసం నిర్మించాలని లక్ష్యంగా ప్రకటించారు. 2015లో ప్రకటించిన ఈ పథకం కింద 2019-20 వరకు దాదాపు 91లక్షల ఇళ్లను నిర్మించారు.
also read నిరుద్యోగులకు గుడ్ న్యూస్...కొత్త ఏడాదిలో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఈ సమయంలో 1.5 కోట్ల ఇళ్లు నిర్మించాలని పెట్టుకున్న లక్ష్యాన్నే చేరుకోలేదు. 2019-20లో కేవలం 4.5లక్షల ఇళ్లే నిర్మించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పథకం మొదటి దశ కంటే దాదాపు మూడు రెట్ల వేగంతో ఇళ్లను నిర్మిస్తేనే లక్ష్యాన్ని చేరుకొనే పరిస్థితి నెలకొంది.
జలశక్తి మంత్రిత్వశాఖ రాష్ట్రాలతో కలిసి పనిచేసి 2024నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కుళాయి నీటిని అందించాలి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 3.28కోట్ల మంది గ్రామీణులకే కుళాయి నీళ్లు అందుతున్నాయి. ఇది కేవలం 18శాతం మాత్రమే అన్నమాట. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను ప్రారంభించి లక్ష్యాన్ని నిర్దేశించినా, ఈ శాఖ విధివిధానాల రూపకల్పనకు 2019 డిసెంబర్ వరకు సమయం పట్టింది.
2024 నాటికి ఈ లక్ష్యాన్ని చేరాలంటే రోజుకు కొత్తగా లక్ష గ్రామీణ గృహాలకు పైపులైన్ నీటిని అందించాల్సి ఉంటుంది. దేశంలో పరిశోధనలకు నిధులను సమకూర్చడానికి, సమన్వయం కోసం, ప్రోత్సహించడానికి నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
2019-20 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ. 1,05,000 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం రూ.17,364 కోట్ల పెట్టుబడులను మాత్రమే ఉపసంహరించుకొంది. అత్యంత కీలక ఎయిర్ ఇండియా విక్రయ ప్రక్రియ నెమ్మదిగా కదులుతోంది.
విదేశీ మార్కెట్ల నుంచి విదేశీ కరెన్సీ రూపంలో రుణాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రకటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. విదేశీ కరెన్సీలో ఎంత రుణం తెచ్చారో ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.
పాన్ కార్డు లేనివారు ఆధార్ నంబర్తో ఐటీ రిటర్నులు ఫైల్ చేసేలా ఏర్పాటు చేయడం. దీంతోపాటు పాన్ నంబర్ అవసరమైన చోట ఆధార్ సంఖ్యను వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు పాన్కార్డును ఆధార్ సంఖ్యతో అనుసంధానించేందుకు తుది గడువును ఈ ఏడాది మార్చి వరకు పొడిగింది. అప్పటిలోగా ఆధార్ సంఖ్యను అనుసంధానించకపోతే పాన్కార్డు నిరుపయోగంగా మారుతుందని అధికారులు ప్రకటించారు.
also read సామ్సంగ్ మొబైల్ నూతన మార్కెటింగ్ చీఫ్గా రోతే మూన్
రూ.50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ ఛార్జీలను తొలగించడం. దీనికి సంబంధించిన ఆదాయపన్ను చట్టం, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ చట్టం 2007లో అవసరమైన సవరణలు తెచ్చింది. తాజాగా రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ పేమెంట్ వ్యవస్థలను ప్రవేశపెట్టకపోతే రోజుకు రూ.5,000 చొప్పున జరిమానా విధిస్తామని తెలిపింది.
ఈక్విటీ అనుసంధానిత పొదుపు పథకం ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ప్రభుత్వం భారత్ బాండ్స్ ఈటీఎఫ్ పేరుతో వీటిని తీసుకొచ్చింది. భారత్లో ఇదే తొలి కార్పొరేట్ బాండ్. దీనిలో కనీసం రూ.1000 నుంచి పెట్టుబడి మొదలవుతుంది.స్టార్టప్ల కోసం డీడీ ఛానెల్స్లో ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటన చేసిన కొన్నాళ్లకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దీనికి స్టార్టప్ కీ బాత్ అని పేరుపెట్టారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు దీనిని నిర్వహిస్తారు.క్రెడిట్ గ్యారెంటీ ఎన్హాన్స్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అటువంటి సంస్థ ఏర్పాటు కోసం ఎటువంటి విధానపరమైన చర్యలు తీసుకోలేదు.