మానుకొండూరులో ఘోరం... ఆర్టిసి బస్సు ఢీకొని మహిళా కూలీల దుర్మరణం

Nov 30, 2022, 10:07 AM IST

కరీంనగర్ : ఆర్టిసి బస్సు ఢీకొని ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందిన విషాద ఘటన కరీంనగర్  జిల్లాలో చోటుచేసుకుంది. మానుకొండూరుకు చెందిన నిరుపేద మహిళలు పస్తం లచ్చవ్వ(32),  కడమంచి రాజవ్వ(35) దినసరి కూలీలుగా పనిచేసేవారు. రోజూ మాదిరిగానే ఇవాళ(బుధవారం) కూడా ఉదయమే కూలీపనులకు వెళుతున్న వీరిని ఆర్టిసి బస్ రూపంలో మృత్యువు కబళించింది. మానుకొండూరులోని కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పక్కనగల హోటల్లో టీ తాగి నడుచుకుంటూ వెళుతున్న మహిళలను వేగంగా దూసుకొచ్చిన ఆర్టిసి బస్సు ఢీకొట్టింది. దీంతో లచ్చవ్వ, రాజవ్వ అక్కడికక్కడే మృతిచెందారు.  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతుల వివరాలు సేకరించి కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.