Oct 29, 2019, 3:52 PM IST
దివ్యకాంతుల దీపావళి ఎన్నో సంబురాల్ని తనతో మోసుకువస్తుంది. అందులో పిల్లలకు ఇష్టమైనది.. దీపావళి కంటే ముందు ఏర్పాటు చేసే బొమ్మల కొలువు. దీపావళికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో బొమ్మలకొలువును ఆనవాయితీగా ఏర్పాటు చేస్తుంటారు. బొమ్మల కొలువు ముఖ్య ఉద్దేశం ఈతరం పిల్లలకు భారతీయ ధర్మం పట్ల అవగాహన, అభిరుచిని పెంపొందించడం, పురాణ, ఇతిహాసాలను కథల రూపంలో తెలియజేస్తూ భారతీయ సంప్రదాయం గురించి తెలియజేయడమే. నరక చతుర్దశి రోజున బొమ్మల కొలువును ఏర్పాటు చేసి దీపావళి మరుసటి రోజు సాయంత్రం వరకు ఉంచుతారు.
బొమ్మల కొలువును తెలుగు ప్రాంతాల్లో బొమ్మలకొలువు, తమిళనాడులో బొమ్మా కొలు, కర్నాటకలో గొంబే హబ్బా పేరుతో పిలుస్తారు. బొమ్మలకొలువులో లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతిలను ప్రధానంగా పూజిస్తారు. ముందు గౌరమ్మ పూజ చేసి అనంతరం కలశం ఏర్పాటు చేసి తమ వద్ద ఉన్న వివిధ బొమ్మలను వరుస క్రమంలో అలంకరిస్తారు.
చక్కెర పొంగలి, పేనీలు, పసుసు, కుంకుమ నైవేద్యంగా సమర్పిస్తారు. తమ చుట్టపక్కల ఉండే మహిళలను, పిల్లలను పిలిచి తమ బొమ్మల కొలువును చూపి వారికి వాయినాన్ని అందజేస్తారు. దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ దేవి పూజను నిర్వహించి, ముత్తైదులను పిలిచి వారికి పసుపు, కుంకుమలను వాయినంగా సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు.