పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి జగన్ సర్కార్ కారణం :నిమ్మల రామానాయుడు

Mar 8, 2023, 12:08 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి జగన్ రెడ్డి ప్రభుత్వమే కారణమని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైసిపి అధికారంలోకి వచ్చేనాటికి అంటే 2019 మే నెలలో కాపర్ డ్యాం 80 శాతం పూర్తయ్యిందని... మిగతా పనులు కేవలం మూడు నెలల్లో పూర్తయ్యేవని అన్నారు. కానీ అప్పటివరకు పనిచేసిన ఏజన్సీని జగన్ సర్కార్ మార్చిందని... ఇదే డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణమయ్యిందని అన్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్, అనుభవ రాహిత్య శాఖా మంత్రి అంబటి రాంబాబు సమాధానం చెప్పాలన్నారు.   టిడిపి హయాంలో రెండు వరద సీజన్లలో డయాఫ్రం వాల్ కాపాడుకున్నాం... కేవలం ఒక్క వరదకే వైసిపి ప్రభుత్వం చేతులెత్తేసి డయాఫ్రం వాల్ ను నాశనం చేసారన్నారు. ప్లడ్ మేనేజ్ మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని అన్నారు. జగన్ హయాంలోనే డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ చెప్పిందని ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు.