నాతో కష్టాలు చెప్పుకున్న మహిళలతో ఇంత ఆటవికంగానా..: వైసిపి సర్కార్ పై చంద్రబాబు సీరియస్

Aug 1, 2022, 4:46 PM IST

ఏలూరు : ఇటీవల గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టిడిపి అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో తనతో కష్టాలు చెప్పుకున్న వరద బాధితులపై వైసిపి ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు దిగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు మానవతా హృదయంతో సాయం చేయాల్సింది పోయి కేవలం కష్టాలను తనతో చెప్పుకున్నందుకు బెదిరిస్తారా? అని చంద్రబాబు నిలదీసారు. ఏలూరు జిల్లా వేలేరుపాడులో వరద సాయం తమకు అందలేదని మాతో చెప్పుకున్న బాధిత మహిళలను పునరావాసం కేంద్రం నుంచి వెళ్లగొట్టడం... బెదిరించడం దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ నేతల క్రూరత్వం తెలిసిందే... కానీ రెవెన్యూ ఉద్యోగులు కూడా వారికి వంత పాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మనమేమన్నా ఆటవికయుగంలో ఉన్నామా? ప్రతిపక్ష నేతలకు కష్టాలు చెప్పుకున్నందుకు ప్రతీకారచర్యలా? అని అడిగారు. ప్రజలను ఆదుకోకుండా తప్పుచేసింది మీరు కాదా? వైసీపీ నేతల ఈ శాడిజాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు.