పవన్ కల్యాణ్ కు ఆరోగ్యం కోసం... అభయాంజనేయస్వామికి జనసైనికుల ప్రత్యేక పూజలు

Apr 18, 2021, 7:58 AM IST

గుంటూరు: కరోనా బారిన పడిన జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని ఆంజనేయస్వామిని వేడుకున్నారు జనసేన నాయకులు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని కేసానుపల్లి గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో స్థానిక  ఆంజనేయ స్వామి దేవస్థానం లో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభయాంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ అభిమాన నాయకుడు, నటుడు పవన్ కల్యాణ్ కరోనా బారినుండి క్షేమంగా బయటపడేలా చూడాలని కోరుకున్నారు. 

అనంతరం జనసేన నాయకులు తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా మహమ్మారి నేడు న్యాయం వైపు నిలబడి సత్య మార్గంలో నడిచే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కి రావటం ఎంతో బాధాకరణమన్నారు. ఈ మహమ్మారి బారినుండి ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిచినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.