మాలాగా కష్టపడి కాదు.. కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని మంత్రయ్యాడు : కేటీఆర్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 14, 2023, 6:34 PM IST
Highlights

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తామంతా  కష్టపడి పైకి వచ్చామని.. కేటీఆర్ మాత్రం కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి అయ్యాడని ఆరోపించారు.

గత కొంతకాలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం తెలంగాణకు కేంద్రం విడుదల చేసిన నిధులకు సంబంధించి ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తామంతా  కష్టపడి పైకి వచ్చామని.. కేటీఆర్ మాత్రం కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి అయ్యాడని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ కంటే కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంతకుముందు కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 3 లక్షల 68 వేల కోట్లు పంపామన్నారు. కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది లక్షా 68 వేల కోట్లేనని కేటీఆర్ దుయ్యబట్టారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. కిషన్ రెడ్డి చెప్పింది తప్పయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. నీకు పదవికి రాజీనామా చేసే దమ్ము ఎలాగూ లేదు.. తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేయలేని అసమర్ధుడివంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం తెలంగాణ ప్రజలకైనా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు దేశానికి సేవలందించిన 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోడీ చేసిన అప్పు ఎక్కువ అని కేటీఆర్ ఆరోపించారు. 

ALso REad: తెలంగాణకు కేంద్రం చేసిందిదే.. కేటీఆర్‌కు కౌంటర్, చిట్టా విప్పిన కిషన్ రెడ్డి

రెండు జాతీయ పార్టీలు అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజల వద్దకు వస్తున్నాయని మంత్రి విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. పెట్టుబడి ద్వారా సంపద సృష్టించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. మోడీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని మంత్రి దుయ్యబట్టారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా.. జెండా, ఎజెండా, మనుషులు, డీఎన్ఏ మారలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల చిట్టా విప్పారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. వరంగల్ , కరీంనగర్ పట్టణాలకు రూ.392 కోట్ల నిధులు విడుదల చేశామని.. అలాగే అమృత్ పథకంలో 12 పట్టణాలకు రూ.833.36 కోట్లు విడుదల చేశామని ఆయన వెల్లడించారు. అలాగే తెలంగాణలోని 143 పట్టణాలలో రూ.2780 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. దీనితో పాటు పీఎంఏవై అర్భన్ పథకంలో భాగంగా తెలంగాణకు 2,49,465 ఇళ్లు మంజూరు చేశామని ఆయన తెలిపారు. వీటి నిర్మాణానికి ఇప్పటికే రూ.3,128.14 కోట్లు విడుదల చేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 2,15,443 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 
 

click me!