
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నేషనల్ పార్క్ అయిన కేబీఆర్ పార్క్ చుట్టూ అక్రమ నిర్మాణాల కోసం నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. కేబీఆర్ పార్క్ సమీపంలో గతంలో నిర్మాణాలు ఈ స్థాయిలో లేవని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే పెరిగాయని ఆయన పేర్కొన్నారు. కేబీఆర్ పార్క్ సమీపంలో వున్న పురాతన భవనాన్ని కూలగొట్టి.. అక్కడ భారీ అపార్ట్మెంట్ కట్టడానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందుకోసం ఓ పత్రిక యజమానికి 2700 గజాల స్థలాన్ని రాయించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ పత్రిక అసలు ఓనర్ కేసీఆరేనని ఆయన పేర్కొన్నారు.
కేబీఆర్ పార్క్ , బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లలో నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు వున్నాయని రేవంత్ చెప్పారు. ఇక్కడ నాలుగు నుంచి ఐదు అంతస్తుల భవనాలు కట్టడానికే అనుమతులు వున్నాయని ఆయన తెలిపారు. 21 అంతస్తుల అపార్ట్మెంట్ వల్ల ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అవుతుందని.. అంతేకాకుండా, అక్కడే పెట్టే ఏసీల వల్ల కేబీఆర్ పార్క్కు వచ్చే అరుదైన పక్షుల మనుగడ ప్రమాదంలో పడుతుందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం కాపాడిన నగరాన్ని కేసీఆర్ నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read: బంధువులకు ప్రభుత్వ భూములు .. కేసీఆర్ చేతిలో లక్ష కోట్ల అవినీతి సొమ్ము, ఆయన ప్లాన్ ఏంటంటే : రేవంత్
డాక్యుమెంట్లు తీసి బీఆర్ఎస్ ప్రభుత్వ భూ దందాను బయటపెడదామన్నా.. వెబ్సైట్లు ఓపెన్ కావడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. తండ్రీకొడుకులిద్దరూ కలిసి హైదరాబాద్ నగరంలో విధ్వంసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చిన్న పాటి వర్షానికే నగరం మునిగిపోవడానికి కేసీఆరే కారణమని తెలిపారు. 7 ఏకరాల్లో వున్న బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి సైతం మూడు అంతస్తుల భవనానికే అనుమతి వుందని.. అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు.
సోమేశ్ కుమార్, జయేశ్ రంజన్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లు, మరో ఇద్దరు ఐఏఎస్లు, తండ్రీకొడుకులు టోటల్గా డీ9 గ్యాంగ్ కలిసి తెలంగాణలో విధ్వంసం సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 20 శాతం భూమిని రాసిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అనుమతులు ఇచ్చేస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. ఈ భూ దందా వెనకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.