ఆయనో హోంగార్డు. ఆయనకు వచ్చే నెల జీతంతోనే ఇళ్లు గడవాలి. అవసరాల కోసం ఆయన బ్యాంకు లోను తీసుకున్నారు. దానిని ప్రతీ నెల ఈఎంఐ రూపంలో చెల్లించాలి. అయితే ఈ నెల ఈఎంఐ చెల్లించాల్సిన టైం దాటిపోతున్నా ఇంకా జీతం పడలేదు. దీంతో ఆయన మనస్థాపానికి గురై అధికారుల ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లోని షాయినాయత్గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ప్రాంతంలోని ఉప్పుగూడకు చెందిన 38 ఏళ్ల ఎం.రవీందర్ హోంగార్డుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. రవీందర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలు అవసరాల నిమిత్తం ఆయన బ్యాంకులో లోను తీసుకున్నారు. దానికి తీర్చేందుకు నెల నెల ఈఎంఐ చెల్లించాలి. చెల్లింపును ప్రతీ నెల 5వ తేదీగా పెట్టుకున్నారు. ప్రతీ నెలా వచ్చే జీతంతో దానిని చెల్లిస్తున్నారు.
మహబూబ్నగర్ టికెట్ కోసం సంజీవ్ ముదిరాజ్ ప్రయత్నాలు.. సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ!
కాగా.. ఈ నెల జీతం ఇంకా పడలేదు. దీనికి కారణాలను తెలుసుకునేందుకు ఆయన గోషామహల్ లో ఉన్న హోంగార్డు కమాండెంట్ ఆఫీసుకు మంగళవారం వెళ్లారు. జీతం ఆలస్యానికి గల కారణాలను అక్కడి సిబ్బందిని అడిగారు. చెక్కులను బ్యాంకులకు ఇప్పటికే పంపించేశామని, ఒకటి లేదా రెండు రోజుల్లో జీతం పడుతుందని వారు బదులిచ్చారు. దీంతో మనస్థాపం చెందిన ఆయన ఆఫీసు బయటకు వెళ్లారు.
హృదయ విదారకం : గాలికి వణికి, నీటికి దడిచి.. రేబిస్ తో బాలుడు మృతి..
అక్కడి అధికారుల ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడున్న అధికారుల సిబ్బంది అలెర్ట్ అయ్యారు. ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు చికిత్స మొదలుపెట్టారు. ప్రస్తుతం రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726) నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.