
Telangana SSC examinations: ఇటీవలి కాలంలో పరీక్ష పేపర్ల లీకేజీలు పెరుగుతున్న పరిస్థితుల మధ్య తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు (ఎస్ఎస్సీ ఎగ్జామ్స్) సీసీటీవీ కెమెరాలో నిఘాలో జరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పేపర్లు లీక్ అయ్యాయనీ, దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుందనీ సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివరాల్లోకెళ్తే.. పదో తరగతి వార్షిక పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణలో నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీల్డ్ ప్రశ్నపత్రాలను తెరవడం నుంచి జవాబు పత్రాలను సీల్ చేసే ప్రక్రియ మొత్తం కెమెరాల్లో రికార్డు అవుతుంది.
గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పేపర్లు లీక్ అయ్యాయనీ, దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలని పరీక్షల సంచాలకులు ఎ.కృష్ణారావు డీఈవోలను ఆదేశించారు. ప్రయివేటు పాఠశాలల్లో అయితే ఆయా పాఠశాలల అధికారులు సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 5.1 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో 180 డిగ్రీల వరకు కదలగలిగే 3 మెగాపిక్సెల్, 30 మీటర్ల పరిధి సీసీ కెమెరా ఉండాలని ఆదేశించారు. రికార్డ్ చేసిన డేటాను భద్రపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. సీసీ కెమెరాలకు మానిటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సీసీటీవీ ఫుటేజీని సీల్డ్ కవర్ లో భద్రపరిచి పరీక్ష చివరి రోజున డీఈవోలకు అందజేయాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు.